పల్నాడుపై బీజేపీ ఫోకస్- కీలక నేతలకు గాలం- కలిసొస్తున్న సమీకరణాలు
ఏపీ, తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉన్న పల్నాడు రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో ఒకటి. పొరుగునే కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా ఇక్కడ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న పరిస్ధితి. దీంతో ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడి పరిస్ధితుల్లో మార్పు రావడం లేదు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల హవా కొనసాగే ఈ ప్రాంతంలో తొలిసారిగా జెండా పాతేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్ధితులను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఇవాళ పల్నాడుకు చెందిన పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..త్వరలో మరింత మంది రానున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
పల్నాడుకు వెనుకబాటే శాపం
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పల్నాడు ప్రాంతంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కక్షలు, కార్పణ్యాల మధ్య అభివృద్ధి మాటే మర్చిపోయిన జనాన్ని కేవలం ఓటర్లుగా పరిగణించే రాజకీయ నేతల స్వార్ధంతో పల్నాడుకు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ అదే వెనుకబాటు తనం గురించి పార్టీలు ప్రస్తావించాల్సిన పరిస్ధితులే కనిపిస్తున్నాయి. దీంతో స్ధానికంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాయలసీమకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటనతో దగ్గరైన బీజేపీ.. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్ధితులే ఉన్న పల్నాడుపైనా ఫోకస్ పెడుతోంది.
బీజేపీకి క్యూ కట్టిన పల్నాడు నేతలు
పల్నాడు ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న అభివృద్ధి లేమిని రూపుమాపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలతో ఇప్పటివరకూ అక్కడ వెనుకబడిన వర్గాలు కూడా ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులో నలిగిపోతున్న వర్గాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ, పలు హోదాల్లో పనిచేసిన అంబటి నవకుమార్ ఇవాళ 400 మంది అనుచరులతో సోము వీర్రాజు సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇందులో పల్నాడు ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
పల్నాడుపై బీజేపీ హామీలతో...
వైసీపీ, టీడీపీ మధ్య కుల యుద్ధంగా సాగుతున్న పల్నాడు వార్కు ముగింపు పలికి అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లేందుకు బీజేపీ సిద్ధమైంది. దీంతో స్ధానికంగా జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు రైల్వే మార్గాల డబ్లింగ్ వంటి హామీలతో బీజేపీ స్ధానిక నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పల్నాడులో ఉన్న కుల సమీకరణాలను పారద్రోలి అభివృద్ధిపై దృష్టిసారిస్తామని సోము వీర్రాజు ఇస్తున్న హామీలు స్ధానికంగా బాగానే పనిచేస్తున్నాయి. దీంతో ఇవాళ అంబటి నవకుమార్ వంటి నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా.. త్వరలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీకి కలిసొస్తున్న సమీకరణాలు ఇవే...
పల్నాడు ప్రాంతంలో జనాభా పరంగా కాపులు, బీసీలు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత స్ధానాల్లోనే మిగతా సామాజిక వర్గాలున్నాయి. టీడీపీని వైసీపీ లక్ష్యంగా చేసుకున్న క్రమంలో ఆ పార్టీకి బీసీలు, ఇతర సామాజిక వర్గాలు క్రమంగా దూరమవుతున్నాయి. టీడీపీలో ఉంటే తమకు మనుగడ లేదని భావిస్తున్నాయి. దీంతో వారంతా ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్పై సీబీఐ కేసులు నమోదు కావడం, బీసీ నేత అంకులు హత్య వంటి పరిణామాలు స్ధానికంగా వైసీపీ, టీడీపీకి మైనస్గా మారుతున్నాయి. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ గురజాల నుంచే తమ రాజకీయాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. అదే సమయంలో జనసేనతో పొత్తు కారణంగా కాపు నేతలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. గురజాలలో పార్టీలో తాజాగా చేరిన కాపు నేత అంబటి నవకుమార్ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించబోతోంది. రెండు కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలన్నా, ఫ్యాక్షన్, కులరాజకీయాలను అరికట్టాలన్న అది బీజేపీతోనే సాధ్యమని నవకుమార్ చెప్తున్నారు.