విజయసాయిరెడ్డిని నమ్ముకుంటే వైసీపీని మూసుకోవాల్సిందే.. సీఎం జగన్పై బీజేపీ నేత బైరెడ్డి విమర్శలు
కొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న బీజేపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మరోసారి అదేపని చేశారు. చంద్రబాబు మీద పగతో జగన్ ఏపీని సర్వనాశం చేస్తున్నారని, అందుకోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా విరుచుకుపడ్డారు.
అలా చేస్తే మూసివేతే..
ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారా అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయని, జగన్ కు ధీటుగా ఎంపీ విజయసాయిరెడ్డి రెండో సీఎంగా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. విజయసాయిరెడ్డిని నమ్ముకుంటే సీఎం జగన్ తొందర్లోనే వైసీపీని మూసుకోవాల్సివస్తుందని వ్యాఖ్యానించారు.
అప్పుడు జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు వాలంటీర్లు
గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ చేస్తున్నారని బైరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని, ఇప్పుడు జగన్ ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జన్మభూమి కమిటీల్లాగే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దీన్నిబట్టి జగన్ కు కూడా బాబుకు పట్టినగతే పడుతుందని అన్నారు.
కేసీఆర్ చేతులో రిమోట్..
చంద్రబాబుకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఏపీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పూర్తిగా దాసోహమయ్యారని, ప్రస్తుతం ఏపీ పరిపాలన రిమోట్ కంట్రోలర్ కేసీఆర్ చేతుల్లో ఉన్నట్లుగానే భావించాలని బైరెడ్డి ఆరోపించారు. బీజేపీ ఒక్కటే ఏపీకి న్యాయం చేయగలదని, జగన్ తీరువల్లే బడ్జెట్ లో రాష్ట్రానికి అదనపు కేటాయింపులు రాలేదని రాజశేఖర్ రెడ్డి అన్నారు.