దూకుడు మీదున్న బీజేపీ: అమరావతికి అనుకూల నేతలపై వేటు: ఎవరు మాట్లాడినా..సాగనంపేలా
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దూకుడు పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొంటోన్న మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనలపై బీజేపీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా.. అమరావతికి అనుకూలంగా ప్రకటనలు చేస్తోన్న నేతలపై వేటు వేయడాన్ని కొనసాగిస్తోంది. అమరావతికి అనుకూలంగా గళం విప్పే నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తోంది.
కన్నాకు భిన్నంగా..
ఇదివరకు బీజేపీ రాష్ట్రశాఖకు నాయకత్వాన్ని వహించిన కన్నా లక్ష్మీనారాయణ హయాంలో క్రమం తప్పకుండా అమరావతికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు కొందరు పార్టీ నేతలు. కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో దీక్షకూ కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదేనంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చినప్పటికీ.. దాన్ని ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు.
సోము వీర్రాజు రాకతో..
కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసిన తరువాత.. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు అందుకోవడంతో పరిస్థితుల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణకు పూర్తి వ్యతిరేకంగా.. పార్టీ మూల సిద్ధాంతాలకు లోబడి నిర్ణయాలను తీసుకుంటున్నారు సోము. అధ్యక్షుడిగా నియమితులైన మరుసటి రోజే.. అమరావతిపై పార్టీ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనేది స్పష్టం చేశారు. పార్టీ సిద్దాంతాలు, మార్గదర్శకాలను పట్టించుకోని నేతలపై కొరడా ఝుళిపించడం ప్రారంభించారు.
లంకా దినకర్కు షోకాజ్ నోటీసులతో..
తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్కు షోకాజ్ నోటీసులను ఇవ్వడంతో బీజేపీలో ఒకరకంగా ప్రక్షాళన ప్రారంభమైందని అంటున్నారు. లంకా దినకర్కు షోకాజ్ నోటీసులను జారీ చేసిన బీజేపీ అక్కడితో ఆగలేదు. అమరావతికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా..వారిపై వేటు వేయడానికి సిద్ధమౌతోంది. కొద్దిరోజుల కిందటే పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండి మాజీ సభ్యుడు ఓవీ రమణను సస్పెండ్ చేసింది బీజేపీ. తాజాగా.. మరో నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణపైనా వేటు వేసింది.
చెప్పుతో కొట్టుకొన్న వెలగపూడి..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన తరువాత.. అమరావతి ఉద్యమం మరింత తీవ్రతరమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. అమరావతి ప్రాంత రైతులకు తమ పార్టీ న్యాయం చేయలేకపోతోందంటూ బహిరంగంగా తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించారు బీజేపీ నాయకులు. షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.