3 ఏళ్ల తర్వాత వైసీపీ ఉండదు -సొల్లు చెప్పడానికి నేను కేఏ పాల్ కాదు: విష్ణుకుమార్ రాజు సంచలనం
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీతో సంబంధాల విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు ఒకలా, ఏపీ నేతలు మరోలా ఆలోచిస్తున్నారా? కీలక బిల్లుల ఆమోదానికి సంబంధించి ఎన్డీఏ పార్టీలు సైతం వెన్నుచూపిన క్లిష్టసమయంలో బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ పట్ల కేంద్రం కూల్ గానే వ్యవహరిస్తున్నా.. స్థానిక నేతలు మాత్రం ఫైర్ బాల్స్ ప్రయోగిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మంగళ, సోమవారాల్లో చేసిన సంచలన కామెంట్లు ఆ వాదనకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.
జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు
మూడేళ్లలో వైసీపీ ఖతం..
ఏపీ సీఎం వైఎస్ జగన్, అధికార పార్టీ వైసీపీని ఉద్దేశించి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మూసివేతకు గురికాబోతున్న పార్టీ అని, మూడు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ఉండదని, ఈ విషయాన్ని వంద శాతం గ్యారెంటీగా చెబుతున్ననని, ఎవరికైనా అనుమానాలుంటే రాసిపెట్టుకోవాలని విష్ణుకుమార్ అన్నారు. ఏపీలోనూ అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వగా, విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. అంతేకాదు..
నేను కేఏ పాల్ను కాదు..
‘‘మూడేళ్ల తర్వాత వైసీపీ ఉండదు. ఆ పార్టీని మూసేస్తారు. మూసేయడం అంటే నా అర్థం ఆ పార్టీ అధికారంలో ఉండదని. గతంలో టీడీపీ ఓడిపోతుందని నేను ముందుగా చెప్పినట్లే జరిగింది. రాజకీయ పార్టీల భవిష్యత్తు గురించి నోటికొచ్చింది చెప్పడానికి నేనేమీ కేఏ పాల్ను కాదు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా, జరగబోయేది చెబుతున్నాను. వైసీపీ అధికారం కోల్పోబోవడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి జగనే. ఆయన పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలకు జగన్ ముద్దులు పెడితే.. నిజమైన ప్రేమే అని జనం నమ్మారు. కానీ ఇప్పుడు వారికి అది కపట ప్రేమ అని తెలిసిపోయింది. ఇంకా..
ఏడాదిన్నరలో ఏం చేశారు?
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కొత్త ఇంటిని నిర్మించడంగానీ, ఒక్కరికైనా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలుగానీ లేవు. చంద్రబాబు హయాంలో 4.74 లక్షల ఇళ్లకు టెండర్లు పిలవగా, వాటి బిల్లుల చెల్లింపులను వైసీపీ నిలిపేసింది. ఉద్యోగాలు లేక యువత, ఇసుక అందుబాటులో లేక నిర్మాణరంగం కుదేలయ్యాయి. జగన్ సొంత మనుషులకు చెందిన లిక్కర్ కంపెనీలకు చెందిన బ్రాండ్లనే ఎక్కువ ధరకు అమ్మిస్తున్నారు. ప్రభుత్వం తీరును ఎవరైనా ప్రశ్నించినా, వ్యతిరేకంగా మాట్లాడినా లాకప్ లోకి నెట్టేస్తున్నారు. ఇక కొత్త రాజధానిగా చెబుతోన్న..
విశాఖలో పెరిగిన అరాచకాలు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అరాచక సంఘటనలు పెరిగిపోయాయి. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. విశాఖలో అక్రమ కట్టడాలంటూ ప్రతి శుక్రవారం రాత్రి నుంచి కూల్చివేతలకు పాల్పడుతున్నారు. తద్వారా బాధితులు కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే ఏపీలో కోర్టులను శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలి. హైకోర్టు బెంచ్ ను విశాఖలో ఏర్పాటు చేస్తేనే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే భయభ్రాంతులు మరింతా పెరిగిపోతాయి'' అని విష్ణు కుమార్ రాజు అన్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై వైసీపీ స్పందించాల్సిఉంది.
చైనా జిన్పింగ్తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీ