వైఎస్ జగన్పై విమర్శలు చేయడంలో ఒక అడుగు ముందే ఉన్న ఆ కీలక నేత..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ ఆత్మీయ సమ్మేళనం సభపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామంటూ వైసీపీ మంత్రులు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే తమ ఆరోపణలకు పదును పెట్టారు రాజకీయ ప్రత్యర్థులు. ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. వెనుకబడిన వర్గాలను ఓటుబ్యాంకుగా మలచుకున్నది వైసీపీయేనంటూ మండిపడుతున్నారు.
ఆత్మీయ సమ్మేళనం..
2024 నాటికి కూడా ఇదే ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది. బీసీల కోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సమాయాత్తమౌతోంది. డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలోని బీసీ సర్చంచులు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. హాజరవుతారు.
మంత్రుల సమక్షంలో..
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్ణయాన్ని తీసుకున్నారు.
బీజేపీ నేత ఘాటు విమర్శలు..
దీనిపై బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ప్రాంతీయ పార్టీలు బీసీలకు ఎలాంటి మేలు చేయలేదని అన్నారు. 2018లో జాతీయ వెనుక బడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమేనని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బీసీ నాయకుడు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా కోటాలో..
అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్లో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను మోదీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అసంఘటిత రంగంలో ఉన్న 38 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన ఈ-శ్రమ్ కార్డులను ఆయనే ప్రారంభించారని అన్నారు. వారికి బీమా, ఆర్థిక రక్షణ కల్పిస్తోన్నారని చెప్పారు. ఈ పథకంతో మత్స్యకారులు, వడ్రంగులు, క్షురకులు లబ్ధి పొందుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.
స్వర్ణకారులకు పేటెంట్ హక్కులేవీ..
విశ్వకర్మ, స్వర్ణకారులు మాత్రమే మంగళసూత్రం తయారు చేస్తారు కాబట్టి వాటిపై పేటెంట్ హక్కులు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాగ్దానం చేశారని, దాన్ని అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం ద్వారా బీసీ వర్గాల రాజకీయ ఎదుగుదలను వైసీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. వాటిని అమలు చేయకుండా బీసీల కోసం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడంలో అర్థం లేదని అన్నారు.