విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తేనట: సోము ఏం చెబుతున్నారు?
అమరావతి: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత రైతు కే శ్రీనివాస రావు చెప్పుతో దాడి చేసిన ఉదంతం..కలకలం రేపుతోంది. ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కొలికపూడి శ్రీనివాస రావు నేపథ్యాన్ని తవ్వి తీస్తోంది. తెలుగుదేశం పార్టీలో అతను క్రియాశీలక కార్యకర్త అని ఏపీ బీజేపీ నాయకులు చెబుతోన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ప్లాన్ ప్రకారమే అతను విష్ణువర్ధన్పై దాడి చేశాడని ఆరోపిస్తోన్నారు.
లైవ్ డిబేట్లో విష్ణుపై చెప్పుతో దాడి -అమరావతి జేఏసీ నేతపై ఛానల్ ఆగ్రహం -కులం కోణం -బీజేపీvsటీడీపీ
ఇదివరకు తిరుపతిలో అమిత్ షా కారుపై..
ఇదివరకు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చిన పార్టీ అగ్రనేత, ఇప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడితో దాడి చేసిన సంఘటనను గుర్తు చేస్తోన్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును ఒకప్పటి టీడీపీ సీనియర్ నేత, ఇప్పటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. లైవ్లో బూతులు తిట్టిన సందర్భాన్ని ఉదహరిస్తోన్నారు. తాజాగా విష్ణువర్ధన్రెడ్డిపై చెప్పుతో దాడి వెనుక కూడా ఉన్నది టీడీపీ నేతలేనని విమర్శిస్తోన్నారు. శ్రీనివాసరావు అమరావతి రైతుగా చెప్పుకొంటోన్నప్పటికీ.. అతను టీడీపీ సానుభూతిపరుడేనంటూ మండిపడుతున్నారు.
కేసు పెట్టాల్సిన బాధ్యత ఆ ఛానల్దే..
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు పెట్టాల్సిన బాధ్యత ఆ ఛానల్ యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు. యాంకర్ను సాక్ష్యంగా పెట్టి.. వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్ముందు టీవీ డిబేట్లకు సంయమనాన్ని పాటించే వ్యక్తులను ఆహ్వానించాలని ఆయన సూచించారు. తమ మీద తమకు నియంత్రణ లేని వ్యక్తులను డిబేట్లకు పిలవొద్దని అన్నారు. తమ పార్టీ నేతపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించేలా చూడాల్సిన బాధ్యత ఆ ఛానల్పై ఉందని చెప్పారు.
ఎన్నికల్లో విస్తృత ప్రచారం..
కొలికపూడి శ్రీనివాస రావు టీడీపీ సానుభూతిపరుడేనంటూ బీజేపీ కార్యకర్తలు స్పష్టం చేస్తోన్నారు. ఇదివరకు ఆయన టీడీపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను వారు సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు. టీడీపీ సీనియర్ నాయకులు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని కుమార్తె శ్వేత, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీనివాసరావు దిగిన ఫొటోలను బీజేపీ కార్యకర్తలు విడుదల చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేసినట్టుగా ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు.