లోకల్ హీట్: సీఎం రమేష్, సోము, మాధవ్లపైనే: జగన్ సర్కార్పై అటాక్: బీజేపీ సరికొత్త వ్యూహం..!
గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధుల పరిపాలనను తీసుకుని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ ఒకవంక న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండగా.. బీజేపీ- సమీక్షా సమావేశాలతో తలమునకలవుతోంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి గల అవకాశాలపై ఆరా తీస్తోంది.
గుంటూరు పార్టీ కార్యాలయంలో..
గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం బీజేపీ రాష్ట్రశాఖకు చెందిన ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జి దగ్గుబాటి పురేంధేశ్వరి, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు కీలక నాయకులు దీనికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సరళి మొదలుకుని.. మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి గల అవకాశాలపై చర్చించారు.
సీమ, ఉత్తరాంధ్రలపై నిఘా..
పార్టీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అధిక సీట్లను సాధించుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, కోస్తా జిల్లాల్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీమంత్రి పైడికొండాల మాణిక్యాల రావు, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ మాధవ్, కంభంపాటి హరిబాబు వంటి నాయకులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
జనసేనతో కలిసి ఎన్నికల బరిలో..
పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో కలిసి ఉమ్మడిగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిల్చుంటున్నామని, ఈ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటికీ సమదూరాన్ని పాటిస్తామని, ఈ రెండు పార్టీలు తమకు విరోధులేనని అన్నారు.
పురంధేశ్వరి సారథ్యంలో ఎన్నికల కమిటీ..
స్థానిక సంస్థల ప్రక్రియను సంస్థాగతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దీనికి పురంధేశ్వరి నాయకత్వాన్ని వహిస్తారని అన్నారు. మూడు ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన నాయకులను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తామని, అభ్యర్థలు ఎంపిక ఈ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే టికెట్లు దక్కుతాయని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపైనే ఫోకస్..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. నకిలీ బ్రాండ్ లతో మద్యం మీద విపరీతం దోపిడి చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకున్నారని, సంపూర్ణ మద్య నిషేధం అనే హామీని కమిషన్ల కోసం వాడుకుంటోందని కన్నా ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని మాయమాటలు చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాత పెట్టిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాలంలోనే ప్రజలపై మోయలేని భారం మోపారని ధ్వజమెత్తారు.
Recommended Video
మూడు రాజధానులతో.. మూడు ప్రాంతాల్లో వ్యతిరేకత..
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత.. మూడు ప్రాంతాల్లో కూడా వైసీపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని కన్నా అన్నారు. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా తాము ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే అభివృద్ధి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.