ఏపీ బీజేపీలో రాజధాని ముసలం..టార్గెట్ కన్నా : టీడీపీ ట్రాప్ లో పడ్డారంటూ : ఢిల్లీకి చేరిన పంచాయితీ..!
ఏపీ బీజేపీలో వర్గ పోరు మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరు మీద పార్టీ నేతలు మండి పడుతున్నారు. ఏపీలో బీజేపీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాల పైన సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం ద్వారా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో కన్నా తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మరో గ్రూపు సమావేశం జరిగింది. రాజధాని విషయంలో కన్నా ఏకపక్షంగా వ్యవహరించారని.. టీడీపీ ట్రాప్ లో పడుతున్నారంటూ రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిన సమయంలో.. ఒకరిద్దరి నేతలతో చర్చించి వారికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కన్నా మీద అసహనం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీలో టీడీపీ..వైసీపీని ఎదుర్కోవటం..పార్టీలో చేరికల పైన చర్చించారు.
ఏపీ బీజేపీలో రెండు గ్రూపుల సమావేశం..
ఏపీలో అధికారమే లక్ష్యంగా ఎదగాలని బీజేపీ నేతలు భావిస్తుంటే..ఏపీలోని పార్టీ నేతలు మాత్రం భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన నివాసంలో ఏర్పాటు చేసిన మేధో మధనానికి పార్టీ లోని కొందరు నేతలు హాజరు కాలేదు. వారు విడిగా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందులో బీజేపీ నేతలు ఐవైఆర్ క్రిష్ణారావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల, మాజీ ఐఏయస్ దాసరి శ్రీనివాసులు సహా మరి కొంత మంది హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సోము వీర్రాజు, సత్యమూర్తి లాంటి వారు హాజరయ్యారు. ఏపీలో పార్టీ పటిష్ఠత..ప్రభుత్వ వ్యతిరేకత..పార్టీలో చేరికల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైనే ఎక్కువగా చర్చించారు. ఏపీలో పార్టీలో చేరికల గురించీ చర్చించినట్లు సమాచారం. రాజధాని..పోలవరం అంశాల్లో పార్టీ వైఖరి ఏంటి.. ప్రభుత్వ తీరు పైన ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాజధాని అంశంలో టీడీపీ హయాంలో జరగిన అవినీతి..పోలవరం ప్రాజెక్టు అవినీతి పైన ప్రధాని మోదీ నాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తూ చర్చ సాగినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశమని..కన్నా ఏర్పాటు చేసింది వ్యక్తిగత సమావేశమని పార్టీ నేతలు చెబుతున్నారు.
కన్నా తీరు ఏకపక్షం..టీడీపీ ట్రాప్ లో పడుతున్నారంటూ...
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోని నేతలు వ్యక్తం చేసారు. సుజనా చౌదరితో చర్చించి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వెళ్లారని..దీని పైన పార్టీ అభిప్రాయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగా..సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. రాజధాని విషయంలో అవినీతి జరిగిందని బీజేపీ అధినాయకత్వం మొదలు రాష్ట్ర నేతలు వరకు అందరూ విమర్శిస్తుంటే..ఇప్పుడు అదే రాజధాని విషయంలో ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక, పోలవరం విషయంలోనూ టీడీపీ స్పందిస్తున్న విధంగానే బీజేపీలోని కొందరు ఫాలో అవుతున్నారని..బీజేపీ వైఖరి ఏంటనేది పార్టీ నేతలతో చర్చించటం లేదనేది వారి ఆవేదనగా కనిపిస్తోంది. అయితే, తాము కన్నాకు వ్యతిరేకంగా సమావేశం కాలేదని.. జాతీయ నాయకత్వానికి ఏపీలో పరిస్థితులు వివరించాలని నిర్ణయించామని..దీని పైనే చర్చిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్య నేత వివరించారు. అక్కడ ఏ సమావేశం జరుగుతుందో తమకు తెలియదని పరోక్షంగా తమలోని ఆగ్రహాన్ని బయట పెట్టారు. వీరు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవాలని నిర్ణయించారు. అంతర్గతంగా రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతల పర్యటన..అక్కడ టీడీపీ నేతలతో కలిసి పర్యటన చేయటం పైన వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ వైసీపీ..టీడీపీ
కన్నా నివాసంలో జరిగిన సమావేశం రహస్య సమావేశ మంటూ పార్టీలో చర్చ సాగుతోంది. అయితే ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ముగ్గురూ.. మాజీ మంత్రి మాణిక్యాలరావు, సోము వీర్రాజు సైతం పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం రాజధాని..పోలవరం విషయంలో వ్యవహరిస్తున్న తీరు పైన చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం పైన రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రాజెక్టు పైన ప్రభావం పడుతుందనే ఆందోళన ఇక్కడి సమావేశంలో వ్యక్తం అయినట్లు సమాచారం. ఇక, రాజధాని పైన ప్రభుత్వం తీరు కారణంగా మొత్తం ఏపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అవేదన వ్యక్తం చేసారు నేతలు. పార్టీ జాతీయ నాయకత్వంతోనూ చర్చించి..స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో..పార్టీలో చేరికల పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ..వైసీపీ లక్ష్యంగా ప్రజల తో మమేకం కావాలని సమావేశంలో పాల్గొన్న నేతలు సూచించినట్లు సమాచారం. అయితే, బీజేపీలో రెండు గ్రూపులుగా సమావేశం అవ్వటం..కన్నా మీద ఒక సమావేశంలోని నేతలు ఆగ్రహంతో ఉండటంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని భావిస్తుండటంతో..రానున్న రోజుల్లో ఇది కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.