బీజేపీ నేతల గృహనిర్బంధం: నేతల అరెస్టు: వేడెక్కించిన ఛలో అమలాపురం
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తలపెట్టిన ఛలో అమలాపురం ఆందోళన కాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టు చేస్తున్నారు. బీజేపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచుతున్నారు.
ఇప్పటికే అమలాపురానికి చేరుకున్న కొందరు నేతలను వారు బస చేసిన హోటళ్లలోనే అడ్డుకున్నారు. అంతర్వేది ఆలయం రథం మంటల్లో కాలిపోయిన ఘటన సహా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని, అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఛలో అమలాపురం ఆందోళనకు పిలుపునిచ్చారు. నిరసన తెలియజేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి, అరెస్టులకు పాల్పడుతున్నాని, వారిపై కేసులను ఎత్తేయాలనేది బీజేపీ నేతల డిమాండ్.
ఈ మేరకు వారు శుక్రవారం ఈ ఆందోళన చేపట్టాల్సి ఉంది. ఇందులో పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి సహా మరి కొందరు నేతలు ఇప్పటికే అమలాపురానికి చేరుకున్నారు. స్థానిక హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనను నిర్బంధించడానికి విష్ణువర్ధన్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుకొనే హక్కు ఉందని, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను తాను ఎక్కడైనా పర్యటించే అధికారం ఉందని అన్నారు.
Recommended Video
సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛలో అమలాపురం ఆందోళలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామంటూ సోము వీర్రాజు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని అన్నారు.ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.