మోడీపై విమర్శలు, అఖిలప్రియకు చిక్కులు!: కుటుంబరావు ముర్ఖుడిలా అంటూ కన్నా
హైదరాబాద్: ఏపీ బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సుధీష్ రాంభొట్ల, దినేష్ రెడ్డి, విష్ణు, కావూరి సాంబశివ రావు తదితరులు గురువారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోడీని దూషించిన వారిని బర్తరఫ్ చేయాలన్నారు.
ఎయిర్ఏషియా స్కాం-బాంబు పేల్చిన బొత్స: ఆ ఫోన్ల తర్వాతే మార్పు, సింగపూర్లో బాబు వారిని కలవలేదా?
2019 ఎన్నికల దృష్ట్యా టీడీపీ నేతలు, మంత్రులు మోడీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానిని తిట్టారని చెప్పారు. అలాగే, ఏపీ మంత్రి అఖిలప్రియ తీరు బాగోలేదని, ఆమెను బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు ఆయన కాన్వాయ్పై దాడి చేసిన తీరుపై కూడా వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
వినతిపత్రం లోని బీజేపీ డిమాండ్లు
మోడీపై అసభ్య పదజాలం ఉపయోగించిన భూమా అఖిల ప్రియను కేబినెట్ నుంచి తొలగించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. మోడీపై, కేంద్ర కేబినెట్ మంత్రులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లఘించిన వారిపై అనర్హత వేటు వేయాలి.బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ, ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబ రావును ఆఫీసు నుండి తొలగించాలి.
గవర్నర్తో భేటీ అనంతరం
గవర్నర్తో భేటీ అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన అఖిలప్రియను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీడీపీ నేతలు, పోలీసు అధికారుల తీరుపై ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రధానిని దూషించడం సరికాదన్నారు. అందుకే అఖిలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
కుటుంబ రావు మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు
ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని కన్నా మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ పాలన కుంటుపడిదన్నారు. ప్రభుత్వానికి పోలీసులు కొమ్ముకాయడం సరికాదన్నారు. అలిపిరి వద్ద అమిత్ షా పైన దాడి ఘటనపై తాము ఫిర్యాదు చేశామన్నారు.
నిన్న మోడీతో గవర్నర్ భేటీ
కాగా, గవర్నర్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పాలన, పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఇతర అంశాలపై సమగ్ర నివేదికను అందించారు. వాటి గురించి వివరంగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం చేపట్టిన రైతుబంధు, రైతుల కోసం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్న రైతులకు జీవిత బీమా, ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిరుద్యోగ భృతి పథకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలుస్తోంది. ఇతర కార్యక్రమాలు, పథకాల పురోగతిని సైతం వివరించారు. విభజన అంశాల స్థితిగతులు, తొమ్మిదో, పదోషెడ్యూలు సంస్థల విభజన, విభజన చట్టంలోని అపరిష్కృత హామీలపైనా చర్చించారు.