అమిత్షాతో ఏపీ బీజేపీ నేతల భేటీ...ఈ సమావేశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టిడిపి
న్యూఢిల్లీ:బీజేపీ చీఫ్ అమిత్షాతో ఏపీ బీజేపీ నేతలు నేడు సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం.
అయితే ఈ సమావేశం ఎపికి సంబంధించి గత సమావేశాలకు భిన్నంగా తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలు అనే దిశలో సమగ్ర విశ్లేషణ జరిగే తీరులో నిర్వహించనున్నట్లు తెలిసింది. వీలైతే అమిత్ షా ఈ సమావేశానికి హజరవుతున్న ఎపినేతలతో విడిగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎపి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, హరిబాబు, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, పురందేశ్వరి ఈ భేటీల్లో పాల్గోనున్నారు.
ఎపి బిజెపికి...కీలక సమావేశం
ఎన్నికలు తరుముకొస్తున్న అత్యంత కీలక సమయంలో ఎపి బిజెపి నేతలతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా న్యూఢిల్లీలో సమావేశం కావడం సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేసేందుకు అమిత్ షా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ దీంతో పాటు ఎపికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
వ్యూహాలు...మారనున్నాయా?...
అయితే ఈ సమావేశం అనంతరం ఎపి నేతలతో అమిత్ షా విడివిడిగా కూడా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎపి నేతలతో సంయుక్తంగా జరిగే సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన జరిగే వ్యూహాలపై చర్చించి మారిన రాజకీయ, కాల మాన పరిస్థితుల గురించి దిశానిర్ధేశం చేసే అమిత్ షా గతంలో అనుసరించిన విధానానికి ఈ ఎన్నికల్లో అనుసరిచబోయే వ్యూహానికి తేడాలేంటో వివరిస్తారట.
విడిగా భేటీలు...జరిగితే...
అయితే సమయం సహకరిస్తే అమిత్ షా ఈ సమావేశం అనంతరం ఎపి బిజెపి నేతలతో విడిగా భేటీ అవ్వాలని భావిస్తున్నారట. తద్వారా రాష్ట్రానికి చెందిన ప్రతి బిజెపి నాయకుడి ద్వారా వారి ధృక్కోణం నుంచి ఎపిలోని రాజకీయ పరిస్థితులపై మరింత లోతుగా అవగాహన పెంచుకోవడంతో పాటు...తద్వారా తమపై తీవ్రంగా దాడి చేస్తున్న అధికార పార్టీని నియంత్రించే వ్యూహాలకు ఇప్పటినుంచే వ్యూహాలు అమలు చేయాలని అమిత్ షా యోచనట. ఆ క్రమంలో రాష్ట్రంలో బిజెపిని టిడిపి ఏ రకంగా...ఏ మేరకు దెబ్బతీస్తోంది...అందుకు ప్రతిగా మనం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటని ఎపి బిజెపి నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారట.
అందుకే టిడిపి...ప్రత్యేక దృష్టి
ఈ క్రమంలో ఎపి బిజెపి నేతలతో అమిత్ షా సమావేశం అనగానే అలెర్టయిన టిడిపి ఈ సమావేశంపై దృష్టి పెట్టి వీలైనంత సారాంశానికి సంబంధించి వీలైనన్ని వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తోందట. ఎపి బిజెపి రాజకీయాలకు సంబంధించి ఈ సమావేశం అత్యంత కీలకం కావచ్చని...ఈ సమావేశం అనంతరం బిజెపి అనుసరించే వ్యూహాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుందని టిడిపి భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే విడి భేటీల్లో ఎపిలో జరగబోయే అనూహ్య ఘటనలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఆయా నేతలను అప్రమప్తం చేసే అవకాశం ఉండొచ్చనేది టిడిపి అంచనా అట. అందువల్లే ఈ సమావేశ వివరాలు కొన్నయినా ముందు తెలుసుకోగలిగితే కౌంటర్ స్టార్ట్ చేయవచ్చనేది టిడిపి యోచనగా తెలుస్తోంది.