బీజేపీ-జనసేనలపై వైసీపీ దాడులు: అమిత్ షాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఎంపీలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరం కాక పుట్టిస్తోంది. అధికార విపక్ష పార్టీల మధ్య అప్పడే వార్ బిగిన్ అయ్యింది. ఇప్పటికే పల విపక్ష పార్టీలపై అధికార పక్షానికి చెందిన వారు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గొడవలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ బీజేపీ ఎంపీలు. ఈ మేరకు ఓ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ మరియు టీజీ వెంకటేష్. ఎన్నికల పేరుతో అధికారిక వైసీపీనేతలు ప్రతిపక్షాలపై దాడులకు దిగుతున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని అదే సమయంలో మరికొందరిని బెదిరిస్తున్నారన్న విషయం అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో అదేపనిగా బీజేపీ జనసేన పార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని లేఖ ద్వారా తెలిపారు.
ఇక ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అనుకున్న మేరకు పనిచేయడం లేదని అధికారపక్షం వైపే మొగ్గుచూపుతోందని లేఖలో తెలిపారు ఎంపీలు. ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు ఎంపీలు. ఇక శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు చూస్తుంటే బెదింరించైనా సరే మెజార్టీ స్థానాలు గెలుపొందాలని వైసీపీ భావిస్తోందని లేఖలో రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రజాస్వామిక మార్గం ద్వారా విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ముగ్గురు ఎంపీలు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నందునే తాము చేసేదేమీ లేక అమిత్ షా దృష్టికి తీసుకొస్తున్నట్లు లేఖలో వివరించారు ముగ్గురు ఎంపీలు. వెంటనే జోక్యం చేసుకుని ఈ అరాచక ఆగడాలకు బ్రేక్ వేయాలని జీవీఎల్, సీఎం రమేష్ , టీజీ వెంకటేష్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరుతూ లేఖలో రాశారు.