లైవ్ లో తిట్లా?..టిడిపి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కన్నా;వాళ్లు కనబడలేదా?:అనురాధ
గుంటూరు:బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లైవ్లో తిట్టడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు.
కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే నేతలు టిడిపిలో ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఉపయోగిస్తున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.
దిగజారిపోయారు:కన్నా
టిడిపి నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని తిడుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారని, చివరకు విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారని...టిడిపి నేతలు ఆ స్థాయికి దిగజారిపోయారని కన్నా దుయ్యబట్టారు.
తిత్లీ బాధితులు...కనిపించలేదా?
మరోవైపు విజయవాడలో టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తీరును తప్పుబట్టారు. ఏపీలో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్కు...శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాన్ బాధితులు, ప్రజల ఇబ్బందులు కనిపించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాకు కేంద్రం తక్షణసాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ ఉచ్చులో పడింది బీజేపీనే అని, అలాగే బీజేపీ-వైసీపీ కలసి జనసేన పార్టీ ఉచ్చులో పడ్డాయని అనురాధ విమర్శించారు.
జగన్ చెప్పాలి:బుద్దా వెంకన్న
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తిత్లీ తుపాన్తో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే...ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించకుండా వెళ్లిపోవడం చాలా బాధకలిగించిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయిగూండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తిత్లీ తుఫాన్ బాధితులకు జగన్ ప్రకటించిన రూ.50 లక్షల తుపాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.
పవన్ కు...అర్హత లేదు
ఇక పవన్ కళ్యాణ్ కు వారసత్వం అనే పదాన్ని ఎత్తేందుకు కూడా అర్హత లేదని బుద్దా వెంకన్న అన్నారు. వారసత్వం కారణంగానే పవన్ సినిమాల్లోకి వచ్చారన్నారు. వైసీపీ-బీజేపీ-జనసేన మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ మూడు పార్టీలు చీకటి ముసుగులను తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ-బీజేపీ-జనసేన ఒకే వేదిక పైకి వచ్చి పోరాడాలని, అప్పుడు తమ బలమేంటో, వారి బలమేంటో తెలుస్తుందని బుద్దా వెంకన్న సవాల్ చేశారు.