చంద్రబాబు, లోకేష్కు తెలియకుండా ఇంత పెద్ద ఈఎస్ఐ స్కామ్ సాధ్యమా?: జగన్ రైట్: బీజేపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభా పక్ష ఉపనేత, కార్మిక శాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ. ఈ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని వ్యాఖ్యానిస్తోంది. అవినీతికి పాల్పడినవారు ఎవరైనా సరే ఆధారాలు ఉంటే అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయాన్ని తీసుకున్నారని పేర్కొంది.
Recommended Video
అచ్చెన్న పాత్రపై ఆధారాలు ఉంటే..
వందల కోట్ల రూపాయల మేర కుంభకోణం చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈఎస్ఐ స్కామ్లో అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర అనేది ఉంటే ఆయనను అరెస్టు చేయడంలో ఏ మాత్రం తప్పు లేదని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించడం సరికాదని చెప్పారు. సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే అరెస్టు చేయాల్సిందేనని తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు.
అచ్చెన్నాయుడి పాత్రపై క్లారిటీ లేదంటూ..
ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఆరంభించిన విషయం ఇదివరకే తన దృష్టికి వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కోట్ల రూపాయల వ్యవహారంతో ముడిపడి ఉందనే విషయం తన దృష్టిలో ఉందని చెప్పారు. ఈ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు తనకు తెలియదని అన్నారు. మీడియాలో వస్తోన్న వార్తలను చూసే తెలుసుకున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, నారా లోకేష్కు తెలియకుండా..
నిజంగానే అవినీతికి పాల్పడి ఉంటే అరెస్టు చేయడం తప్పేమీ కాదని ఆమె స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ క్షమించే ప్రసక్తే లేదని పురంధేశ్వరి చెప్పారు. ఈఎస్ఐ కుంభకోణంలో రాజకీయంగా మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఒక్కటే ఉంటుందని తాను అనుకోవట్లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మరి కొందరు పెద్ద తలకాయల పాత్ర ఉండే అవకాశాలు కొట్టి పారేయలేమని చెప్పారు.
చంద్రబాబు, లోకేష్ల ప్రమేయం..
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు తెలియకుండా ఈ కుంభకోణం జరిగి ఉంటుందని తాను అనుకోవట్లేదని చెప్పారు. అచ్చెన్నాయుడు ఒక్కరే ఇంత పెద్ద స్కామ్కు పాల్పడి ఉంటారంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రమేయం ఉంటుందని తాను నేరుగా చెప్పలేనని, వారికి తెలియకుండా మాత్రం జరిగి ఉండే అవకాశమే లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును జరిపించి, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉందని అన్నారు.