తిరుమల వెంకన్న సన్నిధిలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
తిరుపతి:తిరుమల వెంకటేశ్వరుని ఎపి బీజేపీ నూతన అధ్యక్షుడు కన్నా లక్మీనారాయణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను కన్నా లక్ష్మీనారాయణకు అందజేశారు. స్వామి సన్నిధిలో రాజకీయాల గురించి మాట్లాడేందుకు కన్నా నిరాకరించారు. అయితే ఎపి బిజెపి అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ చిత్తూరు జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
మరోవైపు వేసవి సెలవులు ముగింపుకు వచ్చిన నేపథ్యంలో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు మళ్లీ వీలవుతుందో లేదోనని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఏడుకొండలు భక్తజనంతో నిండిపోయింది. సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని తెలిసింది. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్లు సమాచారం.
ఇలా ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో వసతి సదుపాయాలు దొరక్క భక్తులకు ఇబ్బంది తప్పడం లేదని తెలిసింది. దీంతో భక్తులకు వసతి, భోజన సదుపాయాలను కల్పించేందుకు టిటిడి ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఒక్క మంగళవారం రోజునే శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.72కోట్ల ఆదాయం వచ్చింది.ఈ వారంమంతా కూడా రద్దీ ఇలాగే ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.