మూడు రాజధానుల ఏర్పాటుపై బీజేపీలో చిచ్చు: జగన్ సర్కార్కు అండగా కేంద్రం: కన్నా లేఖ..సీరియస్
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖలో చిచ్చుపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..సొంత పార్టీలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని, దాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపించాలంటూ కన్నా లేఖ రాయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమౌతోంది.
మూడు రాజధానులపై బీజేపీలో తలోమాట..
మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశంపై బీజేపీ నేతల్లో భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సహా సుజనా చౌదరి వంటి కొందరు నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండగా.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు, రాయలసీమకు చెందిన కొందరు నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వంటి మరి కొందరు సీనియర్లు తటస్థ వైఖరిని అనుసరిస్తున్నారు.
కేంద్రంతో సంబంధం లేదంటూ..
మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉందని, దానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదంటూ జీవీఎల్ నరసింహారావు వంటి కొందరు నాయకులు ఇదివరకే స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలించగలిగే వెసలుబాటు ప్రభుత్వానికి ఉందని, దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించలేదని పలుమార్లు చెప్పుకొచ్చారు. పైగా- కర్నూలులో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును నెలకొల్పుతామనే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నేతలు తటస్థంగా..
ఏపీ వికేంద్రీకరణ బిల్లు విషయంలో బీజేపీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకులు తటస్థంగా ఉంటున్నారు. దీనిపై వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉంటూ వస్తోన్న ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడమే దీనికి కారణం.
పేదరికం, వలసలు తగ్గడానికి..
ఉత్తరాంధ్ర స్థితిగతులు, అక్కడి పేదరికం తెలిసిన నేత కావడం వల్లే పీవీఎన్ మాధవ్ వికేంద్రీకరణ బిల్లుపై మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చడం వల్ల వలసలు తగ్గుతాయని ఉత్తరాంధ్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై రాజకీయపరమైన దాడులను కొనసాగిస్తూనే.. విశాఖపట్నం విషయంలో అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించక తప్పదని మాధవ్ సహా ఉత్తరాంధ్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
బిల్లును ఆమోదించవద్దంటూ..
ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దంటూ తాజాగా కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్కు లేఖ రాయడం బీజేపీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఈ లేఖను రాయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చిన సమయంలో..ఆ విషయాన్ని పక్కన పెట్టడం పట్ల ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు.
వికేంద్రీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని ఆమోదించవద్దని కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్కు లేఖ రాశారు. ఈ రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించిందని, ఆ సమయంలో వాటిని ఆమోదించడం సరికాదని అన్నారు. అమరావతిని నిర్మించడానికి కేంద్రం కూడా ఆర్థిక సహాయం అందించిందని అన్నారు. రాజధానిని తరలించడం వల్ల అమరావతి ప్రాంత రైతులు నష్టపోతారని అన్నారు.
Recommended Video
కేంద్రం సీరియస్..
కన్నా లక్ష్మీనారాయణ రాసిన ఈ లేఖపై అటు కేంద్రం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఆరా తీస్తోందని అంటున్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది ఇదివరకు పార్లమెంట్లో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారని, మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై కేంద్రం జోక్యం చేసుకోబోదని కుండబద్దలు కొట్టిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోందని సమాచారం.