సోము వీర్రాజు దూకుడు: హస్తినలో మకాం: మధ్యాహ్నం జేపీ నడ్డాతో భేటీ?: సుజనాపై తాడోపేడో
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొత్తగా పగ్గాలను అందుకున్న సోము వీర్రాజు.. దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కసరత్తు ఆరంభించారు. పార్టీలో భిన్న స్వరాలను వినిపించే వారిపై చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదనే సంకేతాలను ఇస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీకి వంత పాడేలా కనిపించిన లంకా దినకర్ సహా మరి కొందరికి షోకాజ్ నోటీసులు ఇదివరకే జారీ అయ్యాయి. మరి కొందరిపైనా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదనే అంటున్నారు.
బీజేపీలోని టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా: కన్నాను తొలగించిన రోజే..షోకాజ్ జారీ: భారీ ప్రక్షాళన
హస్తినలో సోము మకాం..
సోము వీర్రాజు ప్రస్తుతం హస్తినలో మకాం వేశారు. తనను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఙత తెలుపుకోవడానికి ఆయన దేశ రాజధానికి వచ్చారు. మధ్యాహ్నం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూరకంగా కలుసుకోనున్నారు. మరి కొంతమంది కీలక నేతలతోనూ సోము భేటీ కానున్నారు. నడ్డాతో సమావేశం సందర్భంగా సోము వీర్రాజు సంస్థాగతమైన కొన్ని అంశాలను ఆయన ముందు ఉంచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి సోము వీర్రాజు కొన్ని ఖచ్చితమైన ప్రణాళికలు, వ్యూహాలను రూపొందించుకోబోతున్నట్లు చెబుతున్నారు. జనంలోకి చొచ్చుకెళ్లేలా, క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేలా, పార్టీ వైపు మొగ్గు చూపేలా చేయడానికి అవసరమైన పక్కా ప్లానింగ్తో సోము వీర్రాజు ఉన్నారని సమాచారం. తాను ఎలాంటి వ్యూహాలను అనుసరించదలచుకున్నాననే విషయాలతో కూడిన విషయాన్ని పాయింట్ టు పాయింట్ వివరిస్తూ కొన్ని ప్రతిపాదనలను నడ్డా లేదా ఇతర పార్టీ నేతలకు అందజేస్తారని చెబుతున్నారు.
భిన్న స్వరాల అంశంపై
పార్టీలో ఉంటూ భిన్న స్వరాలను వినిపించే నేతలపైనా సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి మాటే తుది నిర్ణయంగా ఉండేలా ఆయన కసరత్తు చేస్తున్నారని సమాచారం. పార్టీ అధ్యక్షుడి మాటకు భిన్నంగా ఎవరు గళం విప్పినా చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేసేలా స్వేచ్ఛ కల్పించాలని సోము వీర్రాజు అధిష్ఠానాన్ని ప్రతిపాదించవచ్చని చెబుతున్నార
టీడీపీ నుంచి వచ్చిన నేతలతోనే
ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల వైఖరి పట్ల సోము ముందు నుంచీ అసంతృప్తితోనే ఉన్నారని, వారిపై పార్టీపరంగా చర్యలు తీసుకోవడానికి ఆయనకు సర్వాధికారులు అధిష్ఠానం ఇవ్వొచ్చని సమాచారం. బీజేపీలో ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాలను తెలియజేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు సోము. మూడు రాజధానుల విషయం కేంద్రం పరిధిలోకి రాదంటూ హస్తిన వేదికగా సోము చేసిన ప్రకటనను.. పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తప్పుపట్టారు. రాజధాని తరలింపు విషయం కేంద్రం పరిధిలోకే వస్తుందంటూ ప్రకటించారు.
Recommended Video
కేంద్రం నుంచి క్లారిటీ..
ఈ అంశంపై పార్టీ అధిష్ఠానం నుంచి ఓ స్పష్టమైన దిశా నిర్దేశాన్ని సోము వీర్రాజుకు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల విషయంలో పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదా ఈ అంశంపై పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేసేలా లిఖిలపూరకమైన ప్రకటన చేయాలని, ఫలితంగా-సుజనా చౌదరి వంటి నేతల వ్యాఖ్యల ప్రభావం పార్టీలో గందరగోళానికి దారి తీయకుండా ఉంటుందని సోము వీర్రాజు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.