ఒకే రాష్ట్రం..ఒకటే రాజధాని: తీర్మానం దిశగా బీజేపీ అడుగులు: రాయలసీమలో సైతం..!
ఏపీ రాజకీయాల పైన బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశ మని బీజేపీ నేతలు చెబుతున్నా..పార్టీ పరంగా మాత్రం అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఏపీ బీజేపీ నేతలు తమ అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిలో భాగంగా కొత్త తీర్మానం దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
ఈ నెల 11న జరిగే బీజేపీ ఏపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ తీర్మానం చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమ పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో కోసం అక్కడ హైకోర్టు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీని పైన కసరత్తు జరుగుతోంది.
ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని..
ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. బీజేపీ నేతలు సైతం అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే, పాలనా పరం గా మాత్రం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని..కేంద్రం జోక్యం చేసుకోదని చెబుతున్నారు. అయితే, మూడు రాజధానుల దిశగా రాష్ట్ర ప్రభుత్వ ముందుకే వెళ్తున్న సమయంలో రాజకీయంగా అమరావతి ప్రాంతంతో పాటుగా రాయలసీమలో పట్టు సాధించానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఏపీ నేతలు భావిస్తున్నారు.
ఈ దిశగా బీజేపీ అధినాయకత్వంతో చర్చలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అందు కోసం ఈ నెల 11న బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని పేరుతో తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ థియెధర్ హాజరవుతున్నారు. ఆయనతో సైతం దీని పైన చర్చంచినట్లు సమాచారం.
హైకోర్టు కర్నూలులోనే పెట్టాలి..
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెబుతున్నారు. అయితే, విశాఖ..అమరావతిల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బీజేపీ మాత్రం హైకోర్టు కర్నూలులో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలిస్తే దూరం పెరుగుతోందని..ఇది రాయలసీమ వాసులకు ఇబ్బందిగా మారుతుందని వాదనల నడుమ సీమ ప్రాంతం పైన ఇప్పుడు బీజేపీ ఫోకస్ చేసింది.
అక్కడ రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగానే..ముఖ్యమైన నేతలతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాల పైన 11న సమావేశంలో చర్చించనున్నారు.
12న అమరావతి రైతులతో కేంద్ర మంత్రి భేటీ..
ఈ నెల 12న కేంద్ర మంత్రి సదానంద గౌడ ఏపీకి వస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే కేంద్రం వద్ద తమ గోడు వెళ్లబోసుకొనే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారు. దీంతో..ఈ నెల 12న సదానంద గౌడతో రైతుల భేటీ ఏర్పాటుకు బీజేపీ నేతలు నిర్ణయించారు. ఆ తరువాత ఆయన ద్వారానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ..అవకాశం ఉంటే ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అమరావతి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతమని..అక్కడే రాజధాని కొనసాగించాలని బిజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్ర జోక్యం పైన మాత్రం పార్టీ నేతలు భిన్న వాదనలు వినిపించారు. ఇప్పుడు కేంద్ర జోక్యం కంటే..పార్టీ పరంగా ఈ పరిస్థితులను అనుకూలగా మలచుకోవటం పైనే ఇప్పుడు ప్రధానంగా పార్టీ ఫోకస్ చేస్తోంది.