స్ధానిక పోరుకు బీజేపీ రెడీ- సోమువీర్రాజు ప్రకటన-పాత నోటిఫికేషన్ రద్దుకు డిమాండ్
ఏపీలో స్ధానిక ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాలు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని మరోసారి సమర్ధిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్పై వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. రాష్ట్రంలో స్ధానిక ఎన్నికలను బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్ధానిక పోరుకు బీజేపీ సిద్ధంగా ఉఁదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వం వ్యతిరికిస్తున్న ఎన్నికలకు విపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ బీజేపీ ఇద్ అభిప్రాయం తెలిపింది.
స్ధానిక ఎన్నికలను స్వాగతిస్తున్న బీజేపీ.. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను మాత్రం రద్దు చేయాలని కోరుతోంది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు చోట్ల దౌర్జన్యాలతో 25 శాతం సీట్లను ఏకగ్రీవం చేసుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తేనే అభ్యర్ధులకు న్యాయం జరుగుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినా పాత నోటిఫికేషన్ రద్దు చేయకపోవడంపై సోము అభ్యంతరం తెలిపారు.