రథయాత్రకు పోలీసు అనుమతి కోరిన బీజేపీ-కపిల తీర్ధం టూ రామతీర్ధం-ఫిబ్రవరి 4 నుంచి
ఏపీలో ఆలయాల ఘటనలకు నిరసనగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ నేతలు రథయాత్ర నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే నెల 4న తిరుపతిలోని కపిల తీర్ధం నుంచి విజయనగరం జిల్లా రామతీర్ధం వరకూ ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు ఇవాళ పోలీసు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఏపీలో వరుసగా చోటు చేసుకున్న ఘటనలతో భక్తులు, సాధారణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారిలో ధైర్యం నింపేందుకు రథయాత్ర నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే నిర్ణయించారు. దీనిపై అధికార వైసీపీతో పాటు ఇతర విపక్షాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4 నుంచి తాము చేపట్టదలిగిన రథయాత్రకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు ఇవాళ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో ధైర్యం నింపేందుకే తాము యాత్రను చేపడుతున్నట్లు చెప్తున్న బీజేపీ నేతలు.. ఆ మేరకు తమకు అనుమతి ఇవ్వాలని పోలీసులను అధికారికంగా కోరారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతి ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. యాత్రకు రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మరోసారి రాజకీయ వేడి రగలడం ఖాయంగా కనిపిస్తోంది.