జగన్ పై సోము వీర్రాజు ‘అయోధ్య’ అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?
పదవి చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, కరోనాను సైతం లెక్క చేయకుండా వరుస భేటీలు, సమావేశాలతో బిజీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సొంతపార్టీలోని కీలక నేతలతోపాటు అధికార పార్టీకి అనుకూలం అనుకున్న వ్యక్తుల్ని సైతం వ్యక్తిగతంగా కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని ఇరుకున పడేసేలా సీఎం జగన్ పై సరికొత్త అస్త్రాలను ప్రయోగించారు. మరోవైపు, వైఎస్సార్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కూడా తమవైపునకు తిప్పుకునేందుకు కాషాయదళం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజధానికి జంట నగరాల కాన్సెప్ట్ - పంచ నదుల జిల్లాలో పాపాలు - విజయసాయిరెడ్డి దూకుడు
అయోధ్యపై జగన్కు డిమాండ్..
ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరంపై దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక రీతిలో తమ స్పందన తెలపగా, వైసీపీ మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయోధ్యలో ప్రధాని మోదీ రామ మందిరానికి భూమి పూజ చేసినరోజే.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని రాజంపాలెంలో సీఎం జగన్కు కడుతున్న గుడికి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు శంకుస్థాపన చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అయోధ్యకు సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ సోము.. సీఎం జగన్ ముందు సరికొత్త డిమాండ్ ఉంచారు.
యడ్డీ బాటలో యోగికి జగన్ లేఖ..
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం వసతి గృహ సముదాయాలు కూడా రూపుదిద్దుకోనున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వాలు కూడా వసతి గృహాలను నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. ‘‘అయోధ్యలో రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తే.. కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం వసతులు నిర్మిస్తాం''అని అభ్యర్థించారు. యడ్డీలాగే ఏపీ సీఎం జగన్ కూడా అయోధ్యలో ఏపీ వసతి గృహాల నిర్మాణానికి యోగికి లేఖరాయాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ సర్కారు స్పందించాల్సిఉంది.
కన్నాతో తొలిసారి భేటీ..
ఏపీ బీజేపీ చీఫ్ గా పదవి చేపట్టిన తర్వాత సోము వీర్రాజు తొలిసారిగా మాజీ చీఫ్ కన్నా లక్షీనారాయణను కలుసుకున్నారు. గుంటూరులోని కన్నా స్వగృహానికి వెళ్లిన సోము.. గంటసేపు మంతనాలు జరిపి, అక్కడే భోజనం చేశారు. ఇది మర్యాదపూర్వక భేటీనే అని సోము చెప్పినప్పటికీ.. భిన్న రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా, 2024లో బీజేపీ సత్తా చాటుకునేలా, ఆ క్రమంలో కాపు వర్గాన్ని ఐక్యం చేసేలా తాను చేస్తోన్న ప్రయత్నాలకు సహకరించాల్సిందిగా వీర్రాజు కోరినట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవితో చర్చలు జరిపిన సోము, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంను కూడా పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు వినికిడి. మరోవైపు, కాపు సామాజికవర్గానికే చెందిన గంటా శ్రీనివాసరావుపైనా ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వచ్చాయి..
గంటాకు బీజేపీ గాలం?
విశాఖ కొత్త రాజధానిగా అవతరించిన నేపథ్యంలో రాజకీయంగానూ తిరుగులేని శక్తిగా తయారయ్యేందుకు అధికార వైసీపీ.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నది. వైసీపీలోకి గంటా చేరిక దాదాపు ఖాయమైపోగా, మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నది. గంటా దొడ్డిదారిలో వైసీపీలో చేరేందుకు యత్నిస్తున్నారని, భూ, సైకిళ్ల కుంభకోణాలు, ఇతర కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన పార్టీ మారాలనుకుంటున్నారని మంత్రి అవంతి విమర్శించారు. గంటాను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ విశాఖ, భీమిలి ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. గంటా శ్రీనివాసరావుకు అవమానకరంగా పరిణమించిన ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ గాలం వేస్తోన్నట్లు వినికిడి.
సీఎం ద్వారా గంటాతో చర్చలు?
వైసీపీలోకి గంటా చేరికను మంత్రి అవంతితోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ, అంతిమ నిర్ణయం సీఎం జగన్ దేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, అంతవ్యతిరేకతతో ఆ పార్టీలో చేరేకంటే, కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఇంకా మెరుగైన భవిష్యత్తు ఉంటుందని బీజేపీ నేతలు గంటాను ఒప్పించే ప్రయత్నం చేస్తోన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రధానంగా ఎంపీ సీఎం రమేశ్.. గంటాతో ఫోన్ లో చర్చలు చేశారని, నేరుగా పార్టీలో చేరినా, అనర్హత వేటు పడకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ద్వారా కాపుల ఐక్యతకు ప్రయత్నిస్తోన్న సోము వీర్రాజు కూడా ఇందుకు సమ్మతంగా ఉన్నట్లు కథనాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై నేతలెవరూ ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు.
ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..: