బీజేపీలో రఘురామ చిచ్చు.. జగన్కు మద్దతుగా, వ్యతిరేకంగా: ఓవర్ టూ ఢిల్లీ
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న రఘురామకృష్ణం రాజుపై పార్టీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం ఆయన సమాధానం కూడా అంతే స్థాయిలో ఉండటంతో వైసీపీ వలంటర్లీ గివెన్ అప్ ది మెంబర్షిప్ అస్త్రాన్ని రఘురామకృష్ణం రాజుపై వినియోగించేందుకు సిద్ధమవుతోంది. దీంతో రాజుగారి ఎపిసోడ్ మరో టర్న్ తీసుకునేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రఘురామకృష్ణం రాజు బీజేపీలో చేరుతారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇక రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్లో ఏపీ బీజేపీ యూనిట్ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...
రాజుగారి ఎపిసోడ్లో రెండుగా చీలిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రెండుగా చీలిపోయిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం రఘురామకృష్ణం రాజే అని తెలుస్తోంది.గత కొద్ది రోజులుగా నడుస్తున్న రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్లో ఏపీకి చెందిన బీజేపీ నాయకులు ఒక్కొక్కరూ ఒక్కో స్టాండ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఎంతలా అంటే కొందరు ఈ విషయంలో వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు టీడీపీకి సపోర్ట్గా ఉంటున్నారని సమాచారం. అసలే ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ. ఇక్కడ బీజేపీ నేతలు పార్టీ లైన్స్ మరిచి రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో కొందరు వైసీపీకి మద్దతుగా నిలువగా మరికొందరు టీడీపీకి సపోర్ట్గా ఉంటున్నారు. ఇక ఇలా మద్దతుగా ఉన్నవారి జాబితాలో తాజాగా పార్టీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. సత్యకుమార్ ఒకప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కొన్ని దశాబ్దాలుగా వెంకయ్య నాయుడితో కలిసి పనిచేశారు.
రఘురామకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సపోర్టు
ఇదిలా ఉంటే ప్రస్తుతం రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్లో ఆయనకు సత్యకుమార్ అండగా నిలిచారు. తన మద్దతును ప్రకటించారు. లోక్సభ స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై వేటు వేస్తారని వస్తున్న వార్తలను సత్యకుమార్ కొట్టిపారేశారు. అంతేకాదు రఘురామకృష్ణంరాజు వైసీపీ పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కడా చేయలేదని సత్యకుమార్ చెబుతున్నారు. అంతేకాదు రఘురామకృష్ణం రాజు పార్లమెంటరీ కమిటీల్లో ఒకదానికి ఛైర్మెన్గా ఉన్నారంటే అది జగన్ వల్ల కాదని కేవలం బీజేపీ వల్లనే ఆ పదవి తనకు దక్కిందన్న విషయం గుర్తుంచుకోవాలంటూ సమర్థించారు.
వైసీపీ అంతర్గత విషయం సత్యకుమార్కు ఎందుకు..?
ఇక సత్యకుమార్ రఘురామకృష్ణం రాజును వెనుకేసుకురావడంపై బీజేపీలో చర్చకు దారి తీసింది. రఘురామకృష్ణం రాజు అంశం వైసీపీ అంతర్గత విషయం కానుండగా సత్యకుమార్ ఆయన్ను వెనకేసుకురావడమేంటనే చర్చ కమలనాథుల్లో జరుగుతోంది. అది వైసీపీ అంతర్గత విషయం అని సత్యకుమార్ దీనిపై వ్యాఖ్యానించకుండా ఉండాల్సిందని ఓ బీజేపీ నేత కామెంట్ చేశారు. రఘురామకృష్ణం రాజుకు బీజేపీ అండగా ఉంటుందనే సంకేతాలను ప్రజలకు పంపుతున్నామా అని ఆ నేత ప్రశ్నించారు.
రాజధాని విషయంలో కూడా...
అంతకుముందు కూడామూడు రాజధానుల విషయంలో బీజేపీ నేతలు స్టాండ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉన్నింది. మూడు రాజాధానులపై తీసుకొచ్చిన బిల్లులను బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్ మరియు సోము వీర్రాజులు మద్దుతు ప్రకటిస్తూ సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ రాష్ట్రస్థాయి బీజేపీ నాయకత్వం మాత్రం సీఎం జగన్ నిర్ణయంతో విబేధించింది. అదే సమయంలో బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి రాజధాని అంశంలో చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగుతుండగా మరోవైపు కొందరు నేతలు ఇతర పార్టీ నాయకుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు పనిచేస్తున్నారని రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు ఒకరు చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకంటే ఏపీలో మోడీ పాపులారిటీ క్రమంగా పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కమలం పార్టీ బలోపేతం ఎలా చేయాలన్నది ఆలోచించడం మానేసి కొందరు బీజేపీ నాయకులు ఇతర పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తే పనిలో ఉన్నారని ఆ సీనియర్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ బీజేపీలో చీలికలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఒక్కో నాయకుడు ఒక్కోలా టర్న్ తీసుకుంటుండటంతో ఇది రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి తలనొప్పిలా మారిందని చెప్పొచ్చు.