వైసీపీ వంటి పార్టీలను చాలాచూశాం: ఎగిరెగిరి పడొద్దు: మోడీ కోసం అర్రులు: సాయిరెడ్డిపై ఫైర్
అమరావతి: భారతీయ జనతా పార్టీపై వరుసగా విమర్శలను చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రత్యారోపణలను చవి చూస్తున్నారు. బీజేపీ నేతలు ఆయనపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను తాము చాలా చూశామని ఎద్దేవా చేస్తున్నారు. ట్విటర్ వేదికగా సాయిరెడ్డి చేస్తోన్న విమర్శలను సరైనవి కావని, తమను రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
అచ్చెన్నది అల్లాటప్పా స్కామ్ కాదు: కార్మికుల అకాల మరణానికీ లింకు: బాధ్యత బాబుదే: సాయిరెడ్డి
తమ పార్టీపై ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను తాము చాలనే చూశామని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అర్రులు చాస్తున్నాయని అన్నారు. ప్రధాని నుంచి ఫోన్ కోసం, ఆయన అపాయింట్మెంట్ కోసం, తమ పార్టీ అగ్ర నాయకుల పలకరింపుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న విషయాన్ని సాయిరెడ్డి విస్మరించకూడదని అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి విజయసాయి రెడ్డి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలో నాయకత్వంపైన తిరుగుబాటు ధోరణి తలెత్తిందని అన్నారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా తమ పార్టీపై ఆరోపణలను చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ మీద, పార్టీ నాయకుల మీద విమర్శలు, ఆరోపణలు చేయడానికి ముందు.. తమది ఓ ప్రాంతీయ పార్టీ అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించబోతోందని, సాయిరెడ్డి చేస్తోన్న విమర్శలు దీనికి ఓ సంకేతమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇసుక, ఇళ్ల పట్టాలు, భూములు కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై వైసీపీ నేతలు చేస్తోన్న గారడీని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకునే స్థాయిలో వైసీపీ లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తాము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని, మరింతగా బలంగా పోరాడుతామని అన్నారు.