చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు కాపు నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు పార్టీలో మంచి స్పందనే వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో చిరంజీవిని పార్టీలోకి విఫలమైన బీజేపీ నేతలు... ఇప్పుడు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నారు.
బీజేపీలోకి చిరంజీవి రాకను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఇవాళ స్వాగతించారు. చిరు బీజేపీలో వస్తామంటే స్వాగతిస్తామని విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ నేతల వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. బీజేపీ బలోపేతం కోసం సోము వీర్రాజు పలు చర్యలు తీసుకుంటున్నారన్న అంచనాల్లో పార్టీ నేతలు ఉన్నట్లు విష్ణు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
అదే సమయంలో అమరావతి విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారని విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ పార్టీ వేరని, అమరావతిని టీడీపీ సర్కారు రాజధానిగా ఎంపిక చేస్తే కేంద్రం ఆమోదించిందని విష్ణు గుర్తుచేశారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా అమరావతిని ఆమోదించేదన్నారు. ఇప్పుడు మరోసారి రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉందని టీడీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంటులో కేంద్రం చెప్పిందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో హైకోర్టును అమరావతిలో పెట్టేందుకు కేంద్రం ఒప్పుకుందని విష్ణు తెలిపారు.
అమరావతి విషయంలో చంద్రబాబు ఉదయం మాట్లాడింది సాయంత్రం కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులు మాట్లాడుతున్నారని విష్ణు ఆరోపించారు. గతంలో మోడీని గో బ్యాక్ అన్న చంద్రబాబు.. ఇప్పుడు కమ్ బ్యాక్ అంటున్నారని గుర్తుచేశారు. సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టడాని వీల్లేదని, ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఎలా అడుగుతున్నారని చంద్రబాబును విష్ణు ప్రశ్నించారు.