ఆన్లైన్ రమ్మీపై నిషేధం- జగన్ కు థ్యాంక్స్ చెప్పిన బీజేపీ నేత...
విజయవాడ : ఏపీలో ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్లైన్లో రమ్మీ కానీ పోకర్ కానీ ఆడితే ఆరు నెలల జైలుశిక్ష విధించేలా చట్లంలో మార్పులు చేయబోతోంది. అలాగే ఆన్లైన్ నిర్వాహకులు కూడా తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలుతో పాటు జరిమానా కూడా విధించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో పేదల బతుకులను చిదిమేస్తున్న ఆన్లైన్ జూదంపై నిషేధం విధిస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. గతేడాది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆన్లైన్ జూదం నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వైసీపీ సర్కారు దీనిపై ఇవాళ తన నిర్ణయం ప్రకటించింది.
Recommended Video
ఇదే కోవలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఎం జగన్తో పాటు రాష్ట్ర కేబినెట్కు కూడా నా అభినందనలు అంటూ విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. గత మే నెలలో ఆన్ లైన్ జూదంపై నిషేధం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. అనేక కుటుంబాలు, వారి పిల్లలు ఈ వ్యసనానికి బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తన లేఖలో విష్ణు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చక్కటి నిర్ణయం తీసుకుని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయం అని విష్ణు తెలిపారు. ఏపీ కేబినెట్ నిర్ణయంతో ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడలపై నిషేధం ఏర్పడి యువతకు మేలు జరుగుతుందని విష్ణు పేర్కొన్నారు.