రాజధానిపై సీఎం ప్రకటనను స్వాగతించిన బీజేపీ
ఏపీ రాజధాని నిర్మాణంపై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ స్వాగతించింది. సీఎం జగన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించమని ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజధానిపై చేసిన నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని కన్నా చెప్పారు.
సీఎం జగన్వి తుగ్లక్ నిర్ణయాలు... రాజధాని ప్రకటనపై చంద్రబాబు నిప్పులు
రాజధాని నిర్ణయానికి ఫుల్స్టాప్
ఏపీ రాజధాని నిర్మాణంపై గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. రాష్ట్రంలో అధికార వికేద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందంటూ... ఇందుకోసం ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ... ఆయన విస్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం నియమించిన కమిటీ నివేదిక సైతం మరో వారం రోజుల్లో రానుందని ఆయన ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో గత ఆరునెలలుగా కొనసాగుతున్న రాజధాని నిర్మాణంపై వస్తున్న ప్రచారానికి దాదాపుగా అధికారిక ప్రకటన చేసి ఫుల్స్టాప్ పెట్టారు.
ప్రధానికి ఫిర్యాదు చేస్తా...
అయితే రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని అమరావతిలో నిర్మించేందుకు స్యయంగా ప్రధాని నరేంద్రమోడీ పునాదివేశారు. దేశ ప్రధాని స్వయంగా పునాది వేసిన రాజధానిని ఎలా మారుస్తారంటూ... టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు రాజధాని మార్పుపై ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించమన్న బీజేపీ
అయితే రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనను రాష్ట్ర పార్టీ మాత్రం స్వాగతించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విశాఖతో పాటు కర్నూలు ప్రాంతాలు ఇప్పటికే కొంత మౌలిక అవసరాలు కల్గి అభివృద్ది చెందిందని చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర బీజేపీ నిర్ణయంతో సీఎం జగన్ ప్రభుత్వానికి కొంత వెసులుబాటు కలిగే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బీజేపీకి టీడీపీ దగ్గరవుతుందన్న ప్రచారం జరుగుతున్నా... అందుకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగితించడంతో టీడీపీ ఒంటరిగా పోరాడాల్సిన అవకాశాలు ఏర్పడింది.