AP Budget 2020: శాసనసభలో ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే ... ఆసక్తికరంగా సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.ఇక నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ కేటాయింపులను వివరించి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.కానీ మండలిలో ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది .
ఈరోజు ఉదయం గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించి, నల్ల చొక్కాలు ధరించి సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది.దీంతో ప్రతిపక్షమే లేకుండా, ప్రశ్నించే వారే లేకుండా ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ,అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి బిల్లును, సీఆర్డీఏ బిల్లును, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఇక ఈ బిల్లులు శాసనసభ్యులచేత ఆమోదించబడ్డాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. ఇక ఈ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లుపై వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తోనే టీటీడీలో సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు లభించిందని ఆయన పేర్కొన్నారు చట్టంలో సన్నిధి యాదవులను మార్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులు శాసనమండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే గతంలో సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందలేదు. తాజాగా మరోమారు శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు శాసన మండలికి ఆమోదానికి వెళ్లనున్నాయి. మొదటి నుండి టిడిపి అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉన్న శాసనమండలిలో టిడిపి రేపు వీటిని అడ్డుకోవడానికి ఏం చేస్తుంది? ఇక అధికార వైసిపి ఈ బిల్లులను పాస్ చేయించుకోవడానికి ఏం చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.