ఏపీ బడ్జెట్ .. కొత్త సీసాలో పాత సారాలా వుంది అన్నటీడీపీ నేత కళా వెంకట్రావు
ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలిపద్దుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరోటి కాదని అంటున్నారు. ఒక పక్క ప్రచార ఆర్భాటం తప్ప పస లేదని యనమల వ్యాఖ్యానిస్తే ఏపీ బడ్జెట్ .. కొత్త సీసాలో పాత సారాలా వుంది అని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు చేశారు .
యనమల వ్యాఖ్యలపై ఫైర్ అయిన జోగి రమేష్ .. కళ్ళు పోయాయా, మైండ్ బ్లాంక్ అయిందా అని ప్రశ్న
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందుచూపులేనిదంటూ అభివర్ణించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించిన చంద్రబాబు అందుకు నిదర్శనమే బడ్జెట్ కేటాయింపులేనన్నారు. శ్వేతపత్రంలో ఒకలా చెబుతారు , బడ్జెట్లో మరోలా చెప్తారని విమర్శించారు చంద్రబాబు . ఇక తాజాగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బడ్జెట్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉందని విమర్శించారు. బడ్జెట్మొత్తం అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధిలేదని పేర్కొన్నారు . రైతు సంక్షేమం కోసం పని చేస్తామని చెప్తున్న ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. విద్యుత్ రంగానికి రూ.400 కోట్లు ఏ మూలకు సరిపోతాయని మాజీ మంత్రి కళా వెంకట్రావు నిలదీశారు. ఈ బడ్జెట్ రైతులు, పేదలు, యువతకు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ లో రాష్ట్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని రూపొందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదని కళా వెంకట్రావు విమర్శించారు .