3రాజధానులపై టీడీపీ ‘గవర్నర్’ బాంబు.. మండలిలో సేమ్ సీన్ రిపీట్.. వైసీపీకి తిప్పలు తప్పవు..
మూడు రాజధాననుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై వైసీపీ సర్కారును మళ్లీ ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ఈసారి కొత్త ఆయుధాన్ని ప్రయోగించనుంది. మండలిలో తనకున్న సంఖ్యా బలంతో ఆ రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిన టీడీపీ.. ఈసారి ఏకంగా గవర్నర్ ప్రసంగాన్నే తిరస్కరించాలని నిర్ణయించుకుంది. కిందటి సమావేశాల మాదిరిగానే మండలిలో సేమ్ సీన్ రిపీట్ చేసి.. తద్వారా సీఎం జగన్ కు చెక్ పెట్టాలని డిసైడైంది. మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన యనమల.. బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ అనుసరించబోయే ఎత్తుగడలను ముందే వెల్లడించారు. గత సమావేశాల్లోలాగా గందరగోళం ఏర్పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్నిముందస్తుగా హెచ్చరిస్తున్నామని, ప్రతిపక్ష పార్టీని గౌరవించి, మంచిమాట వినకపోతే వైసీపీ సర్కారును మరింత ఇబ్బందిపెడతామని స్పష్టం చేశారు. యనమల ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
ఆ పని చేయడానికి వీల్లేదు..
‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆ ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారుచేస్తుంది. గవర్నరమెంట్ పాలసీలనే గవర్నర్ చదివి వినిపిస్తారు. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులు(వికేంద్రీకరణ బిల్లు), సీఆర్డీఏ రద్దు అంశాలను ప్రస్తావించొద్దని మేం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే, ఆ రెండు బిల్లుల్ని శాసన మండలి గతంలోనే తిరస్కరించింది. మండలిలో తిరస్కరణకు గురైన ప్రజావ్యతిరేక బిల్లుల్ని మళ్లీ గవర్నర్ ప్రసంగంలో పెట్టి.. అదే తమ పాలసీగా చెప్పుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ పని చేయడానికి వీల్లేదని మేంం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మా మాట వినకుంటే గవర్నర్ ప్రసంగాన్ని కూడా తిరస్కరిస్తాం. అప్పుడు సంక్షోభం తలెత్తుతుంది.
చదవివేముందు గవర్నర్ చూసుకోవాలి..
శానస మండలిలో తిరస్కరణకు గురైన రెండు ప్రజావ్యతిరేక బిల్లుల్ని గవర్నర్ ప్రసంగ పాఠంలో చేర్చబోతున్నట్లు మాకు పక్కా సమాచారం అందింది. గవర్నమెంటుకు ఎలాగో బుద్ధిలేదు.. కనీసం గవర్నరైనా ప్రసంగం చదివే ముందు అందులో ఈ రెండు అంశాలో ఉన్నాయేమో క్రాస్ చెక్ చేసుకోవాలి. సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ఏ సభలోనూ తిర్కరించరు. కానీ ప్రజల తరఫున పోరాడటానికి మాకున్న ఆప్షన్ అదొక్కటే. గవర్నర్ ప్రసంగం తిరస్కరణ ద్వారా రాష్ట్రం పరువు పోకూడదనుకుంటే ప్రభుత్వం వెంటనే దిగిరావాలి.
మాకు అడ్డొస్తే అంతే సంగతి..
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని రూల్ 71 కింద శాసన మండలిలో ముందే డిజాల్వ్ చేశాం.. అయినాసరే కనికరించి వాటిపై చర్చించి.. సెలెక్ట్ కమిటీలకు పంపాం. కానీ అసెంబ్లీ అధికారుల్ని బెదిరించిమరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం అడ్డుకుంది. దీనిపై మండలి చైర్మన్ షరీఫ్.. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మండలిలో ప్రతిపక్ష పార్టీగా మా హక్కులను ఎవరూ అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకోవాలని చూస్తే.. గతంలో ఏం జరిగిందో మీరే చూశారు. సర్కారు తీరు మారకుంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది.
ఈ పాటికి పని పూర్తయ్యేది..
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై నిమిషాల్లో నిర్ణయాలు తీసుకుని.. క్షణాల్లో కేబినెట్ చేత ఆమోదించుకుని.. అరగంటలోనే అసెంబ్లీలో పాస్ చేయించుకున్నారు. ప్రక్రియ ఇంత ప్రజాస్వామికంగా జరిగింది కాబట్టే మేం మండలిలో వాటిని అడ్డుకున్నాం. టీడీపీ సూచించినట్లు సెలెక్ట్ కమిటీల్ని ఏర్పాటుచేసి ఉండేదుంటే ఈపాటికి పని కూడా పూర్తయి ఉండేది. సీఎం జగన్ మొండితనం వల్లే రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా పెక్యూలియర్ సిట్యువేషన్ ఏర్పడబోతోంది.. దాన్ని అందరూ చూడబోతున్నారు''అని యనమల వివరించారు. ఇంకా సీఎంను ఉద్దేశించి..
అన్నీ నియంత లక్షణాలే..
ప్రపంచ చరిత్రలో జగన్ తో సరిపోల్చడానికి ఏ క్యారెక్టరూ సరిపోదని యనమల ఎద్దేవా చేశారు. ఇండియాలో తుగ్లక్ మహాశయుడు.. జర్మనీలో హిట్లర్.. ఇటలీ ముస్సోలినీ.. రోమన్ చక్రవర్తి నీరో.. వీళ్లందరినీ కలగలిపితేకూడా జగన్ కు సాటిరారని విమర్శించారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలో తన స్వార్థం తప్ప ప్రజల గురించి పట్టింపు ఉండదు కాబట్టే.. ప్రజల తరఫున, ప్రజల గొంతుకగా టీడీపీ పోరాడుతున్నదని యనమల చెప్పారు.