AP Budget 2020: అసెంబ్లీలో టీడీపీ వాకౌట్..మండలిలో మాత్రం చర్చలో:రీజన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ఈసారి టిడిపి భిన్నమైన స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది. ఒకపక్క అసెంబ్లీలో చర్చ నుండి వాకౌట్ చేసిన టిడిపి, మండలిలో మాత్రం అక్కడే ఉండి ఫైట్ చేస్తోంది.ఇక దీనికి చాలా పెద్ద కారణమే ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
శాసనసభ నుండి వాకౌట్ అందుకే
ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సమావేశాల్లో నిరసన తెలియజేయాలని,సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ,అసెంబ్లీలో బలం తక్కువగా ఉన్న కారణంగా అసెంబ్లీ సమావేశాలలో నల్ల చొక్కాలు ధరించి తమ నిరసన తెలియజేసి వాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక టిడిపి ఎమ్మెల్యేలు ఎంతగట్టిగా వాదించినా వైసిపి ప్రభుత్వం అనుకున్నదే చేస్తుంది . ఒకవేళ గట్టిగా వ్యతిరేకించినా బయటకు పంపించి మరి తాము అనుకున్న బిల్లులను పాస్ చేసుకుంటుంది అని భావించి శాసనసభ నుండి వాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
శాసనమండలిలో టీడీపీ గట్టిగానే పోరాటం
ఇక ఇదే సమయంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న శాసన మండలిలో మాత్రం టిడిపి బలంగా ఉన్న కారణంగా, టిడిపి మెజారిటీ సభ్యులు ఉన్నకారణంగా గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు గవర్నర్ బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు టిడిపి ఎమ్మెల్యేలు. ఇక మరోవైపు మండలిలో మాత్రం గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా అక్కడే ఉండి నిరసన తెలియజేశారు. ఇక శాసనసభలోనూ, మండలిలోనూ డిఫరెంట్ స్ట్రాటజీతో వెళుతున్న టిడిపిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బడ్జెట్ తో పాటు 8 అంశాలకు సంబంధించిన బిల్లులు
రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు 8 అంశాలకు సంబంధించిన బిల్లును కూడా పెడుతున్నారు. సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లు కూడా ఉందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇక మండలిలో సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొందలేదు. తొమ్మిది నెలల తర్వాత బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.
సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకునే వ్యూహంలో టీడీపీ
సీఆర్డీఏ రద్దుచేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని గతంలో తీసుకున్న వైసీపీ ప్రభుత్వం తాజా సమావేశాలలో మరోమారు సీఆర్డీఏ రద్దు బిల్లు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మండలిలో బలంగా ఉన్న టిడిపి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును అడ్డుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే మెజారిటీ సభ్యులు ఉన్నకారణంగా శాసనమండలిలో రెండు రోజులపాటు చర్చలో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది.
Recommended Video
ప్రభుత్వానికి ముందర కాళ్ళకు బంధాలు వెయ్యాలని నిర్ణయం
పలు ముఖ్యమైన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, శాసనమండలిలో టిడిపి అడ్డుకునే స్ట్రాటజీతో వెళ్లబోతోంది. ఇందులో భాగంగానే మండలి సభ్యులకు చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేసి,ఎలాగైనా టిడిపి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బిల్లులను అడ్డుకోవాలని సూచించారు. ఇక పలు కీలక బిల్లులపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ముందర కాళ్ళకి బంధాలు వెయ్యాలన్న ఉద్దేశంతోనే టిడిపి మండలిలో కొనసాగనుంది. ఇక శాసనసభలో తమ మాట చెల్లుబాటు కాబట్టే శాసనసభ సమావేశాలకు వచ్చి నిరసన తెలియజేసి వాకౌట్ చేసింది.