27 నుంచి ఏపీ అసెంబ్లీ: 28న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్: 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభించాలని భావించినా.. 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కారణంగా ఎమ్మెల్యేలు ఆ రోజు సభకు రావాల్సి ఉంటుంది. దీంతో..ఆ మరుసటి రోజు నుండే సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండు నెలలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా సాధారణ బడ్జెట్ కు అవకాశం లేకపోవటంతో ఈ నెల 28న రెండు నెలలకు సంబంధించిన పద్దులతో ఓట్ ఆన్ ఎకౌంట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 31లోగా ఈ పద్దుకు ఆమోదం పొందాల్సి ఉంది. దీంతో..31న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపి సమావేశాలను వాయిదా వేయనున్నారు. ఇక, ఏకగ్రీవం అనుకున్న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ అనివార్యం కావటంతో.. ఈ నెల 23న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. అదే రోజున పార్టీ నుండి బరిలో ఉన్న నలుగురి సభ్యులను పెద్దల సభకు ఎన్నుకోవటం పైన మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
28న ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..
ఏపీ ప్రభుత్వం 2020-2021 వార్షిక బడ్జెట్ స్ధానంలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కేవలం రెండు నెలలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలతో ఈ నెల 28న ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 27న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ..అదే రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 30, 31 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి ముఖ్యమంత్రి సమాధానం తో పాటుగా బడ్జెట్ పైన చర్చ చేపడుతారు. 31లోగా ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వం జీతాలకు కూడా నిధుల విడుదలకు అనుమతి ఉండదు. దీంతో..రెండు నెలల పద్దుల పైన చర్చ నిర్వహించి ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపటంతో సభను నిరవధికంగా వాయిదా వేసేలా ప్రణాళిక సిద్దం అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
26న మాక్ పోలింగ్...నలుగురి సభ్యులకు ఓట్లు ఇలా..
ఏపీ నుండి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు చివరి నిమిషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఏకగ్రీవమని భావించిన ఎన్నికలకు ఇప్పుడు పోలింగ్ అనివార్యమైంది. సభలో ఉన్న బలంతో వైసీపీ నుండి నలుగురు సభ్యులు ఏకగ్రీవమని అంచనా వేసారు. దీంతో..వైసీపీ నుండి అయోధ్యారామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ నామినేషన్లు దాఖలు చేసారు. ఇక, టీడీపీ నుండి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుండి వైసీపీకి దగ్గరైన ముగ్గురు తమ పార్టీ శాసనసభ్యులకు ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ ఈ ఓటింగ్ ను అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. అందుకోసం తమ పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేయనుంది.
Recommended Video
అభ్యర్థుల విజయం లాంఛనమే
ఇక, వైసీపీ నుండి 151 మంది సభ్యులు ఉండటంతో..పోటీలో ఉన్న నలుగురు అభ్యర్ధులకు వీరిని విభజించనున్నారు. ముగ్గురు అభ్యర్ధులకు 38 మంది చొప్పున.. నాలుగో అభ్యర్ధికి 37 ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను ఖరారు చేస్తున్నారు. ఇక, టీడీపీ పోటీలో ఉన్నా సంఖ్యా బలం లేకపోవటంతో వైసీపీ నలుగురు అభ్యర్ధుల విజయం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే, ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు చర్చకు రావటం..సభలో రాజకీయ వేడి పుట్టించటం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.