ఏపీకీ భద్రాచలం..! జగన్ అభ్యర్ధన..కేసీఆర్ పరిశీలన: కేంద్రం సైతం సుముఖం..సాధ్యమేనా..!
హైదరాబాద్లోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్..ఇదే సమయంలో తెలంగాణ నుండి కీలక గ్రామాన్ని ఏపీలో విలీనం చేసేందుకు మంతనాలు ప్రారంభించారు. భద్రాద్రిని ఏపీలో కలిపే అంశం పైన ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదించారు. పరిశీలిస్తానని కేసీఆర్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రం సైతం ఏపీ సీఎం ప్రతిపాదన పైన సుముఖంగా ఉన్నట్లుగా ఏపీ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, ఇది అంత సులువుగా తేలే వ్యవహారామా అనే చర్చా ఉంది.
ఏపీకీ భద్రాచలం...జగన్ అభ్యర్ధన..
ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలంను ఏపీలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాద్రిని ఎపిలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కారు సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్తో ఇటీవల జగన్, తెలంగాణ సిఎం కెసిఆర్ రాజ్భవన్లో జరిపిన భేటీలో భద్రాద్రి విలీన అంశం తెరమీదకొచ్చినట్లు తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది జరగాలంటే ముందుగా రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్లో సవరించాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి.
నాడు విలీనం ఎందుకు ఆగిందంటే..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా ఏడు మండలాలను ఎపిలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టిఆర్ఎస్ అభ్యంతరపెట్టాయి. ఇప్పుడు కూడా ఈ అంశం కార్యాచరణలోకి వస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. సమైక్య రాష్ట్రంలో ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్ 1959కి పూర్వం ఆంధ్రా ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాధమిక సదుపాయాలను మెరుగు పర్చే లక్ష్యంతో భద్రాచలం డివిజన్ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కోసం భద్రాచలం ఊరు తప్ప మిగతా మండలమంతా, కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలను తిరిగి ఎపిలో కలిపారు.
ప్రజల మూడ్ తెలుసుకున్నాకే..
భక్తుల..ప్రజల మనోభాలతో ముడి ఉన్న భద్రాద్రి రామాలయం సెంటిమెంట్తో కూడిన అంశం. భద్రాద్రి మాత్రమే తెలంగాణలో ఉండగా..చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఏపీలో ఉంది. దీంతో..భద్రాచలం వాసులు పాలనా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదే కారణంతో ఐటిడిఎ, విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ గిరిజనుల కు ఇబ్బందిగా పరిణమించిందనీ చెబుతున్నారు. ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడర ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భద్రాచలం పౌర సంఘా లు, వేదికలు తమ తమను ఎపిలో కలపాలని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించాయని సమాచారం. వారు ఏపీ సీఎంను కలిసేందుకు సిద్దమవుతున్నారు. అఇయతే, సెంటిమెంట్తో ముడి పడి ఉన్న అంశం కావటంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.