అమరావతి రైతులకు అదనపు ప్రయోజనాలు: రాజధాని బిల్లులకు ఆమోదం..సీఆర్డీఏ రద్దు: కేబినెట్ నిర్ణయాలు..!
కీలకమైన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు బిల్లులకు ఆమోద ముద్ర వేసారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ డీసెంట్రలైజేషన్ దిశగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లు పైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీనికి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా అమరావతి సీఆర్డీఏ బిల్లును ఉపసంహరించి..ఆ స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇక, రాజధాని రైతులకు ఏ రకంగా ప్రయోజనం చేకూర్చాలనే అంశం పైనా చర్చ జరిగింది. ఇప్పటికే గత ప్రభుత్వం భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు డెవలప్ చేసిన స్థలం ఇస్తామని చెప్పిన దాని కంటే రెండు వందల గజాలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు చెల్లించాలని అప్పట్లో నిర్ణయించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అది మరో అయిదేళ్లు కొనసాగనుండి. అమారావతి ప్రాంత డెవలప్ మెంట్ పైన సభలో ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
4 ప్రాంతీయ మండళ్లు..25 జిల్లాల పైనా చర్చ
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా శాసన రాజధానిగా అమరావతి..పరిపాలనా రాజధానిగా విశాఖ..న్యాయ రాజధానిగా కర్నలు ఖరారు చేసారు. ఇదే సమయంలో మొత్తం 13 జిల్లాలను నాలుగు ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటుకు నిర్ణయించారు. దీంతో పాటుగా 13 జిల్లాలను 25 జిల్లాలు ఏర్పాటు పైనా కేబినెట్ లో చర్చ జరిగింది .దీని పైన అధికారికంగా శాససభలో ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. ఇక, రాజధాని రైతులకు పదేళ్లు కౌలు నిర్ణయాన్ని 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు రూ 2500 ఉన్న కౌలును రూ 5000 కు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది.
Recommended Video
హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం..
జీఎన్ రావు..బోస్టన్ కమిటీ నివేదికల పైన అద్యయనం చేసిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని పైన కేబినెట్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించిన ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ బిల్-2020 బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఇక, దీంతో పాటుగా సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ పైనా అధికారులు వివరించారు. న్యాయ పరంగా ఇబ్బందులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలను చెప్పుకొచ్చారు. ఏపీలో ఈక్వల్ డెవలప్మెంట్ ఉంటుందని అందరి ప్రయోజనాలకు కాపాడుతామంటూ ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సహచరులకు అభయం ఇచ్చారు. ఏ ప్రాంతం వారికి ఆందోళన అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు.
లోకాయుక్తకు ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు..
ఇక, ఇదే సమావేశంలో అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు సమయంలో జరిగిన అక్రమ భూ లావాదేవీలపైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక పైన చర్చ జరిగింది. అందులో చంద్రబాబు తో సహా లోకేశ్ సైతం ఉన్న విషయాన్ని మంత్రుల మధ్య చర్చకు వచ్చింది .దీని పైన ప్రభుత్వం ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. కాగా..లోకాయుక్తకు ఇవ్వాలని చివరగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 4056 ఎకరాల భూములు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిర్ధారించారు. ఇక, సీఆర్డీఏ బిల్లుకు సంబంధించి ఆర్దిక బిల్లుగానే ప్రతిపాదించాలని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అని ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలని..మంత్రులు వారిని సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.