ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వోద్యోగులే: 51 వేల మందిని గుర్తిస్తూ..: ఇతర కార్పోరేషన్లు మాత్రం..!
ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. అందులో భాగంగా ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో పని చేస్తున్న 51,488 మంది ఉద్యోగులు ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రవాణా.. రోడ్డు ..రహదారులు- భవనాల శాఖల్లో ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. వీరందరినీ అందులో అకామిడేట్ చేయాలని మంత్రివర్గం నిర్ణయుంచింది. ఇక ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రభుత్వంలో విలీనం కేవలం ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తుందని..మిగిలిన కార్పోరేషన్లను వర్తించదని కేబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
ఇక..వారంతా ప్రభుత్వ ఉద్యోగులే..
ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తొలి కేబినెట్ సమావేశంలోనే దీని పైన అధ్యయనం కోసం సీనిచర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నాయకత్వంలో నిపుణుల కమిటీ వేసారు. ఆ కమటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చింది. సాంకేతికంగా ఆర్టీసీని నేరుగా ప్రభుత్వంలో విలీనం చేయాలంటే సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను వివిరస్తూ..కొన్ని సూచనలు చేసింది. వాటి అమల్లో భాగంగా ప్రభుత్వం రవాణా.. రోడ్డు ..రహదారులు- భవనాల శాఖల్లో ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి..అందులో ఆర్టీసీ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా ఇక..ఏపీయస్ ఆర్టీసీలో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.
51,488 మందికి ప్రయోజనం..ఔట్ సోర్సింగ్ కొనసాగింపు
ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రజా రవాణా శాఖలో తొలుత 51,488 పోస్టులను సృష్టించి భర్తీకి నిర్ణయిస్తారు. ఆ పోస్టుల్లో ప్రస్తుతం ఆర్టీసీలో పని చేస్తున్న 51,488 మందిని అకామిడేట్ చేస్తారు. ఆ ప్రక్రియ అంతా జనవరికి పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అనుకున్న సమయానికి ఎటువంటి చిక్కులు లేకుండా ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తి చేసి..జనవరి నుండి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి జనవరి వేతనాలు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇదే సమయంలో ఆర్టీసీలో పలు విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలను కొనసాగించాలని..వారిని విధుల నుండి తొలిగించకూడదని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
ఆర్టీసీకే పరిమితం..మిగిలిన కార్పోరేషన్లకు నో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పైన చర్చ సమయంలో ఆసక్తి కర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 1997లో అప్పటి సర్కారు జీవో నం.14ను తీసుకొచ్చిందని.. దీని ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వలో విలీనం చేసేందుకు వీల్లేదని అధికారులు వివరించారు. చంద్రబాబు అన్నింటినీ అడ్డుకుంటారని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ముందుగా 14/97 జీవోను రద్దు చేయాలని ఆయన ఆదేశించగా, అలా చేస్తే, మిగిలిన ప్రభు త్వ రంగ సంస్థలు కూడా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయని అధికారులు చెప్పారు. అలాగైతే, ఈ జీవోను రద్దు చేస్తూనే, ఆర్టీసీని మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని ద్వారా ఆర్టీసీ తరహాలో తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఇతర కార్పోరేషన్లు ముందుకు వచ్చే అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.