బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపులు రద్దు: అమ్మఒడి..రూపాయి రిజిస్ట్రేషన్ కు ఏపీ కేబినెట్ ఆమోదం..!
త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు ఏపీ మంత్రివర్గం ఆమోద మద్ర వేసింది. అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న జగనన్న అమ్మఒడి పధకం జనవరి 26 నుండి అమలు చేయాలని..విధి విధానాలను ఖరారు చేసారు. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటుగా వైజాగ్ లో లులు గ్రూప్ కు కేటాయించిన 13.83 ఎకరాలు(1500కోట్లు)విలువ చేసే భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి 300 చ.గజాల వరకు రెగ్యులరైజ్ చేయాలని, 100 చ.గ.లోపు ఉంటే రూపాయికే రిజిస్ర్టేషన్ చేయాలని నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
బాలకృష్ణ వియ్యంకుడి భూముల రద్దు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. నాటి ప్రభుత్వం కేవలం లక్ష రూపాయలకే ఈ భూమిని కేటాయించటం..ఆ తరువాత ఆ భూమిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావటం పైన అధ్యయనం చేసిన ప్రభుత్వం..భూ కేటాయింపులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వైజాగ్ లో లులు గ్రూప్ కు కేటాయించిన 13.83 ఎకరాలు(1500కోట్లు)విలువ చేసే భూమిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో కేటాయించిన ఈ భూముల విషయంలో ఆ సంస్థ ఒప్పందాలను ఉల్లఘించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు.
జగనన్న అమ్మఒడి విధి విధానాలు ఖరారు..
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకం వర్తింప చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఒడి పధకం కింద ఏటా 15 వేలు ఇవ్వనున్నట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఈమేరకు పథకానికి రూ.6,450 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. తెల్లరేషన్కార్డు .. ఆధార్ ఉన్నవారికి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుందన్నారు. తెల్లకార్డుకు దరఖాస్తు చేసుకున్న ఆదారం చూపించినా లబ్దిదారుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ పధకానికి జగనన్న అమ్మ ఒడి పధకం గా పేరు ఖరారు చేసారు. గ్రామీణ నియోజక వర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని, ఎరువులు ల్యాబ్లో పరిక్షించిన తర్వాతనే రైతులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెట్టింపు పోషకాహారం అందించే పైలెట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో రూ. 90 కోట్లతో పథకం ఈ పథకం అమలుచేయాలని కూడా కేబినెట్లో నిర్ణయం జరిగింది. కృష్ణా, గోదావరి కెనాల్స్ వద్ద క్లీనింగ్ మిషన్ ఏర్పాటు పై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పంట కాలువల్లో మురుగునీరు కలవకుండా శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రూపాయికే రిజిస్ట్రేషన్..
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి 300 చ.గజాల వరకు రెగ్యులరైజ్ చేయాలని, 100 చ.గ.లోపు ఉంటే రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా సేవ చే సే వారికి వైఎస్సార్ లైప్టైల్ ఎచీవ్మెంట్ అవార్డులు ఇవ్వడంతోపాటు, 10 లక్షల నగదు బహుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే హజ్, జెరూసలేం యాత్రీకులకు ఆర్ధిక సాయం మరింత పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మినహ దేవాలయాల్లో బోర్డు సభ్యుల నియామకం కోసం చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ కార్పొరేషన్ విభజనకు కేబినెట్ ఆమోదించింది. మాల, మాదిగ, రెల్లి ఇతర షెడ్యూల్డ్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా రాష్ట్రంలో ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇసుకతోపాటు రోబోసాండ్ని కూడా వినియోగించాలని, స్టోన్ క్రషింగ్ యూనిట్లకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం జరిగిందని మంత్రిపేర్ని నాని వెల్లడించారు.