రైతులకు విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్ .. భగ్గుమంటున్నటీడీపీ నేతలు
విద్యుత్ నగదు బదిలీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంతో పాటుగా, రైతులకు నగదు బదిలీ విధానంలో బిల్లులు చెల్లించాలనే ప్రతిపాదనలకు ఏపీ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏపీ సచివాలయంలో ఈరోజు భేటీ అయిన క్యాబినెట్ పలు అంశాలపై చర్చించింది. త్వరలోనే పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు ఆమోదం తెలిపింది . విద్యుత్ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడానికి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఖరారు చేసింది. డిసెంబర్లోగా విద్యుత్ మీటర్లను జిల్లాలో బిగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నిప్పులు చెరుగుతుంది.
ఉచిత విద్యుత్ విధానంలో మార్పులు .. మీటర్ల బిగింపు .. నగదు బదిలీ
ఇప్పటివరకు ఏపీ ప్రజలకు ప్రభుత్వం నేరుగా అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని మారుస్తూ, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ముగించాలని , కరెంట్ బిల్లులు కట్టేందుకు రైతులకు బ్యాంకు లలో నగదు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. అయితే కేంద్ర సంస్కరణల్లో భాగంగానే మీటర్ల విధానం వచ్చిందని , కేంద్రం నాలుగు రంగాల్లో నగదు బదిలీ తెచ్చిందని అందులో భాగంగానే విద్యుత్ రంగంలో నగదు బదిలీ విధానం అమల్లోకి తీసుకువచ్చామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం పై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు
మీటర్లతో భయం .. అదనంగా బిల్ వస్తే చెల్లించేది ఎవరు ? దేవినేని ఫైర్
రైతులకు ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ అమలుపై చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ మండిపడుతున్నారు. తాజాగా టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఉమా అన్నదాతల్లో మీటర్ భయం పట్టుకుందని, వాడకం పెరిగితే షాకేనా అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు అదనపు బిల్లులు రైతులు చెల్లించాలా ? అంటూ ప్రశ్నించారు. నగదు బదిలీలో సర్కారును నమ్మలేమని, జీవోలో స్పష్టత లేదని రైతు సంఘాలు తేల్చి చెబుతున్నాయి అంటూ పేర్కొన్న దేవినేని ఉమా అప్పుల కోసం మమ్మల్ని బలి చేస్తారా ? అని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
మీటర్ల ఏర్పాటు నిర్ణయం వెనక్కు తీసుకోండని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్టేనా అంటున్న రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పండి సీఎం జగన్ గారూ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. ఇక మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యవసాయ రంగానికి విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మీటర్లతో ఎవరికి ఎలాంటి లాభం ఉంటుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మీటర్ల బిగింపుతో రైతులకు ఎటువంటి లాభం ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం, రైతులకు విద్యుత్ కోసం నగదు బదిలీ చేస్తామని చెప్పడం మోసమని ఆయన మండిపడ్డారు.
Recommended Video
ఏపీ మంత్రివర్గ భేటీలో విద్యుత్ నగదు బదిలీ విధానానికి ఆమోదం
టిడిపి నేతలు ఎందరు ఎన్ని విమర్శలు చేసినా, ఏపీ ప్రభుత్వం మాత్రం తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకు వెళుతూనే ఉంది. అందులో భాగంగానే నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని, రైతులకు నగదు బదిలీ పథకంలో భాగంగా బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుని, ఆ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది.
రైతులకు ఈ విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.