తుని విధ్వంసం కేసులు ఎత్తివేత: భోగాపురం నిరసనకారుల పైన కేసులు మాఫీ: కేబినెట్ లో కీలక నిర్ణయం..!
రెండు కీలక అంశాల పైన నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన విధ్వంసం కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో జరిగిన సభ సమయంల కొందరు అక్కడ విధ్వసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగానూ అలజడి రేపింది. ఆ తరువాత కాపు రిజర్వేషన్ల కోసం ఆనాడు కమిటీ ఏర్పాటు చేసారు. ఈ విధ్వంసం వెనుక వైసీపీ ఉందని నాడు టీడీపీ ఆరోపించింది. ఇక, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా భోగాపురంలో విమానాశ్రయం కోసం భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైన నమోదైన కేసులను ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తుని విధ్వసం కేసులు ఎత్తివేత
కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సభ ఏర్పాటు చేసారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతలు హాజరయ్యారు. సభ జరుగుతుండగానే కొందరు యువకులు సడన్ గా తుని పోలీస్ స్టేషన్పై దాడి, రైలుపై రాళ్లు రువ్విన ఘటనలో పలువురిపై సుమారు 69 కేసులు నమోదయ్యాయి. ఇందులో వైసీపీ నేతలు కొందరిపైన ఆరోపణలు రావడంతో అప్పట్లో సీఐడీ పోలీసులు విచారించారు. అదే సమయంలో రత్నాచల్ ఎన్స్ ప్రెస్ ను దహనం అయింది. దీంతో..ఆ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డిని సైతం పోలీసులు విచారించారు. కడప నుండి వచ్చిన వారే విధ్వంసానికి కారణమంటూ నాటి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ కేసుల వ్యవహారం పైన నివేదిక కోరింది. దీని పైన కేబినెట్ లో చర్చించిన తరువాత వాటిని ఎత్తివేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం నిర్ణయం పైన ఆసక్తి..
ఈ అంశం అప్పట్లో రాజకీయంగా రాష్ట్రంలో సంచలనానికి కారణమయింది.. ప్రధానంగా తుని విధ్వంసం విషయంలో రాజకీయంగా వైసీపీ లక్ష్యంగా నాటి టీడీపీ ప్రభుత్వంలోని పలువురు విమర్శలు చేసారు. వైసీపీ నేతల మీద ఆరోపణలు చేసారు. కానీ, ఏ ఒక్కరి పైనా చర్యలు మాత్రం తీసుకోలేదు. అదే సమయంలో కేసుల పేరుతో కాపు యువతను తూర్పు గోదావరి జిల్లాలో వేధింపులకు గురి చేస్తున్నారని తాజాగా టీడీపీ నుండి వైసీపీలో చేరిన ప్రముఖ కాపు నేత ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఆ కేసులు ఎత్తివేత విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రైలు దహనం కేసు రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఇక, ఇతర విధ్వంసాల కేసులు మాత్రం రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేసారు. వీటన్నింటి పైనా చర్చించి..న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
భోగాపురం నిరసనకారుల కేసులు వెనక్కు
ఇక, విజయనగరంలో భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారి పైన అప్పట్లో కేసులు నమోదయ్యాయి. అయితే, ఆ తరువాత భోగాపురం కాంట్రాక్టు వ్యవహారంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ఆ ప్రాంతంలో పర్యటంచిన వేళ అక్కడ తమ మీద కేసులు నమోదైన అంశాన్ని స్థానికులు జగన్ కు వివరించారు. దీని పైన న్యాయపరమైన అభ్యంతరాలను పరిశీలించి..తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కేసులను సైతం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.