రేపే ఏపీ కేబినెట్: రెండు రోజుల ముందుగానే: కానీ, హైకోర్టు లో కొత్త ట్విస్టు..!
ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెండు రోజులు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం లో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం..ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశం లో నివేదికను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే, ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం నిర్ణయం మార్చుకుంది. రేపు మధ్నాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించి..అందులో హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించాలని డిసైడ్ అయింది. ఈ రోజు ఉదయం హైపవర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
నివేదికకు తుది రూపు గురించి చర్చించారు. అయితే, సీఎం రేపు ఢిల్లీ పర్యటనలో మార్పు కారణంగానే కేబినెట్ సమావేశాన్ని ముందుగానే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రేపు మధ్నాహ్నం సమయానికి మంత్రులంతా విజయవాడ చేరుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో సీఆర్డీఏ లో రైతుల ఫిర్యాదులకు సమయం సోమవారం మధ్నాహ్నం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. అప్పటి వరకు హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని రైతులు పిటీషన్ లో అభ్యర్ధించారు. దీంతో..ఇప్పుడు కేబినెట్ సమావేశం..హై పవర్ కమిటీ నివేదిక పైన సందిగ్దత ఏర్పడింది.
రెండు రోజులుగా ముందుగానే కేబినెట్..
ఏపీ కేబినెట్ సమావేశం ముందుగా నిర్ణయించిన సమయం కంటే రెండు రోజుల ముందుగానే..శనివారం మధ్నాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైపవర్ కమిటీ నివేదిక సైతం సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం కమిటీ అధికారికంగా ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. దీంతో..శనివారం మధ్నాహ్నం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నివేదికకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
ఆ తరువాత సోమవారం నుండి మూడు రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికలతో పాటుగా రాజధాని బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి వాస్తవంగా శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అక్కడ అప్పాయింట్ మెంట్ రేపు రాత్రి నుండి ఎప్పుడైనా ఖరారయ్యే అవకాశం ఉండటంతో ముందు గానే ఈ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.
హైకోర్టు ఉత్తర్వులతో సమయం పొడిగింపు..
మూడు రాజధానులు..అమరావతి నుండి రాజధాని తరలింపు పైన అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ అమరావతి రైతులకు తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు చెప్పుకొనేందుకు సమయం ఇచ్చారు. ఇందు కోసం సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాట్లు చేసారు. అయితే, తమకు మరింత సమయం పొడిగించాలని..అప్పటి వరకు హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించకుండా ఆదేశాలివ్వాలని రైతులు కోర్టును అభ్యర్ధించారు.
అయితే, కోర్టు రైతులకు తమ అభ్యంతరాలు వెల్లడించే సమయం సోమవారం మధ్నాహ్నం వరకు పొడిగిస్తూ..తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో..ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి అధికారికంగా అందితే.. కేబినెట్ సమావేవం పైన నిర్ణయం మారే అవకాశం ఉంది. ఇక, ఇదే సమయంలో కోర్టు తాజా ఉత్తర్వులు అమలు చేయాలంటే 20న జరిగే అసెంబ్లీ సమావేవం పైన ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల పైన ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.