ఎన్.పి.ఆర్ పై కేంద్రం ఆదేశాలను పక్కనబెట్టాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, ఉగాదికి ఇళ్లపట్టాలు
అమరావతి సచివాలయంలో ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ జనాభా గణన ప్రశ్నావళిలో పేర్కొన్న పలు ప్రశ్నలు మైనార్టీల్లో భయాందోళనలు కలిగిస్తున్నందున ప్రస్తుతానికి జనగణనను పక్కనబెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు ఉగాదికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, రామాయపట్నం పోర్టు అభివృద్ధికి వీలుగా కృష్ణపట్నం పోర్టు పరిధి తగ్గింపు, ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండెకరాల భూమి రద్దు వంటి నిర్ణయాలు ఉన్నాయి.
జాతీయ జనగణనకు నో
మూడు నెలలుగా మైనార్టీల్లో ఎన్.పి.ఆర్.పై నెలకొన్న భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని వారిలో భరోసా నింపేందుకు 2010 జనాభా లెక్కల ప్రశ్నావళికే ఈసారి జనాభా లెక్కలను పరిమితం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. దీనిపై కేబినెట్ తీర్మానం కూడా చేసింది. అప్పటివరకూ ప్రస్తుత ఎన్.పి.ఆర్ నమోదు ప్రక్రియను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం
ఉగాది రోజు 26 లక్షల మంది పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలకు మొత్తం 43141 ఎకరాల భూమి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఇంటి పట్టాను వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే కాకుండా నిర్దేశిత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంటి స్ధలం పొందిన లబ్ది దారులు ఐదేళ్ల పాటు ఇల్లు కట్టుకోవడానికి, వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకులో తనఖా పెట్టుకునేందుకు, ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు కల్పిస్తూ అవకాశం ఇచ్చింది. ఎమ్మార్వో ఆఫీసును జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయంగా గుర్తిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ప్రాంతాలను వైఎస్సార్ జగనన్న కాలనీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
ఏపీ కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
రామాయపట్నం పోర్టు అభివృద్ది కోసం కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు పరిధిలోనే రామాయపట్నం పరిధి ఉంది. మరోవైపు
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్ధకు ఇచ్చిన కాంట్రాక్టులో చేసిన మార్పులను కేబినెట్ ఆమోదించింది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్టు పరిధి 3000 ఎకరాల నుంచి 2500 ఎకరాలకు కుదించనున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం మిగతా భూమి వాడుకోనున్నారు.. జీఎంఆర్ కు పనుల కాంట్రాక్టు అప్పగింతకూ ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలకరి ఏరువాక దృష్ట్యా రైతులకు విత్తనాలు సేకరించి, అందుబాటులో ఉంచేందుకు ఏపీ సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు రూ.500 కోట్ల నిధులు తెచ్చేందుకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటీపీఎస్, కృష్ణ లో పురోగతిలో ఉన్న 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఏఫీ జెన్ కో కు వెయ్యి కోట్ల చొప్పున రుణం తీసుకునేందుకు బ్యాంకు గ్యారంటీ ఇస్తూ కేబినెట్ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో గతంలో టీడీపీకి కేటాయించిన రెండెకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ఈ భూమిని తిరిగి ప్రభుత్వ శాఖలకు అప్పగించనున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద సున్నిపెంట గ్రామ పంచాయతీ ఏర్పాటుతో పాటు, నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటు, అందులో 44 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఏర్పాటు చేసిన సిట్ పరిధిని పెంచుతూ, విచారణకు అనుమతి ఇస్తూ, కేసుల నమోదు ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది.