ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ విస్తరణ...ఆ రెండు పోస్టులే భర్తీ:కిడారి కుమారుడికి చోటు?
అమరావతి:ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 11న కేబినెట్ విస్తరణ చేసేందుకు ఆయన ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం కేబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అందులో ఒక పోస్టును ఇటీవల ప్రకటించినట్లు మైనారిటీ నేతతో భర్తీ చేయనుండగా మరో పదవిని మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎస్టీ కోటా లో ఈ పదవిని అప్పగించనున్నట్లు సమాచారం.
నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో 26 మంది వరకు మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంది. బిజెపి-టిడిపిల మధ్య పొత్తు తెగతెంపుల నేపథ్యంలో ఎపి కేబినెట్ నుంచి బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు వైదొలగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర మంత్రి మండలిలో ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉండగా మరో ఇద్దరికి కేబినెట్ బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి.
దీంతో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసేందుకు ఈ రెండు మంత్రి పదవులను సిఎం చంద్రబాబు భర్తీ చేయాలని గత కొంతకాలంగా భావిస్తున్నా వివిధ కారణాల రీత్యా సాధ్యపడలేదు. అయితే తాజాగా మంత్రి వర్గ విస్తరణకు నవంబర్ 11 ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం కేబినెట్ ఎస్టీ, ముస్లిం నేతలకు ప్రాతినిథ్యంలేని తరుణంలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారితోనే ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు భర్తీ చేయాలని సిఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎస్టీ కేటగిరీ నుంచి ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ కు కేబినెట్ లో చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి అభిమతంగా తెలుస్తోంది. ఎస్టీ కేటగిరిలో కిడారి శ్రవణ్ కాకుంటే పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిలో ఒకరిని అదృష్టం వరిస్తుంది. ఇక ముస్లిం మైనారిటీ కేటగిరిలో అమాత్య పోస్టును ఎవరితో భర్తీ చేస్తారనేది ఉత్కంఠ భరితమేనని చెప్పక తప్పదు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు చెందిన నేతకే మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం టిడిపి లో వ్యక్తం అవుతుండగా ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ కే ఆ అవకాశం లభించవచ్చని అత్యధికులు భావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీలో ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు. దీంతో వివిధ సమీకరణాల రీత్యా మిగిలిన వారికంటే ఫరూక్కే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫరూక్ మండలి ఛైర్మన్గా ఉన్నందున మరి ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ కూడా జరుగుతోంది.
ఆదివారం ఉదయం తొలుత మంత్రి పదవుల భర్తీ, అనంతరం 10 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిసింది. ఆ కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.