త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ? ఇద్దరు మహిళలు సహా నలుగురు మంత్రుల ఔట్ ! కీలక మంత్రుల శాఖల మార్పు
ఏపీలో స్ధానిక ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్ధానిక ఎన్నికల పోరు వాయిదా, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లనుండటం, మరికొన్ని కారణాలతో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. ఇందులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం నలుగురు నుంచి ఐదుగురికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అదే సమయంలో కేబినెట్ లోని కొందరు సీనియర్ మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
ఏపీలో కేబినెట్ విస్తరణ ?
ఏపీలో తాజాగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యలతో పాటు ఇతరత్రా కారణాలతో కేబినెట్ లో పలువురు మంత్రులను సాగనంపి, మరికొందరిని తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అతి త్వరలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని చెబుతున్నారు.
ఎవరు ఇన్ - ఎవరు ఔట్...
కేబినెట్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న వారిలో ఇద్దరు మహిళలతో పాటు మొత్తం నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి రద్దు ప్రతిపాదనల నేపథ్యంలో రాజ్యసభకు ఎంపిక కానున్నారు. వీరు ఆ నలుగురిలో ఉన్నారా లేదా అన్నది మాత్రం తేలలేదు. అయితే ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున ఆ తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తానికి నలుగురు మంత్రుల స్ధానంలో సామాజిక సమీకరణాల దృష్ట్యా పలువురు కొత్త ఎమ్మెల్యేలకు చోటు దక్కవచ్చు.
సీనియర్ల శాఖల్లో మార్పులు..
కేబినెట్ విస్తరణ అంటూ చేపడితే ప్రస్తుతం మంత్రివర్గంలోని పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు తప్పేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం కమ్ రెవెన్యూ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన చూస్తున్న రెవెన్యూశాఖను జగన్ కు సన్నిహితుడైన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే పెద్దిరెడ్డి చూస్తున్న మైనింగ్ తో పాటు ఇతర శాఖలను మిగతా మంత్రులకు అప్పగించవచ్చు. అలాగే మున్సిపల్, ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు
Recommended Video
కేబినెట్ ప్రక్షాళన కారణాలు...
సీఎం జగన్ తన కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో దీని వెనుక కారణాలేంటన్న చర్చ కూడా మొదలైంది. అయితే రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు మంత్రులు రాజ్యసభకు వెళ్లనుండటం, మంత్రుల పనితీరుపై అందుతున్న నివేదికలు కేబినెట్ ప్రక్షాళనకు కారణాలు కావొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులపై అందుతున్న నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నజగన్ వారిలో కొందరికి ఉద్వాసన పలకాలని భావిస్తున్నారు. అయితే కేబినెట్ లోకి వచ్చేటప్పుడే వారికి అవినీతి కానీ ఇతరత్రా ఆరోపణలు కానీ వస్తే ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఇచ్చేశారు. కాబట్టి వాటిని కారణంగా చూపుతూ మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు అర్ధమవుతోంది. వైజాగ్ కు సచివాలయం తరలించే లోగా సీఎం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది...అన్నీ అనుకూలిస్తే ఉగాది తర్వాత ఏపీ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి...