నెల రోజులే: ఇక లోకల్ హీట్: తీర్పు రాగానే నోటిఫికేషన్.. బస్సు యాత్రతో టీడీపీ బిజీ..!
అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. వచ్చేనెల 15వ తేదీ నాటికల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో.. గడువు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమౌతోంది. ఈ నెల 20వ తేదీ లేదా అంతకంటే ముందే నోటిఫికేషన్ వెలువడటానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగుబాటు: దళంలో ప్రాంతీయ భావాలతో..
మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. గ్రామ, పట్టణ, జిల్లా లేదా నగర స్థాయిల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలుత పంచాయతీ రాజ్ ఎన్నికలను నిర్వహిస్తారు. అనంతరం జిల్లా పరిషత్, ఆ తరువాత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ చేపడతారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే వీలైనంత త్వరగా వాటికి ఎన్నికలను నిర్వహించి, ప్రజా ప్రతినిధుల పాలనలోకి తీసుకుని రావాలని ప్రభుత్వం భావిస్తోంది.
సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడగానే..
నిజానికి- జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి అవసరమైన షెడ్యూల్ను కూడా ప్రభుత్వం రూపొందించుకుంది. నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందే..ఎన్నికలను అడ్డుకోవాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. త్వరలోనే తీర్పు వెలువడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ వెంటనే నోటిఫికేషన్ను విడుదల చేయవచ్చని అంటున్నారు.
బస్సు యాత్రతో టీడీపీ జనంలోకి..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పెద్దగా సమయం లేకపోవడం వల్ల అన్ని రాజకీయా పార్టీల్లో హడావుడి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బస్సు యాత్రను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీకి గట్టిపోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.
బీజేపీ వరుస సమీక్షలు..
భారతీయ జనతా పార్టీ సమీక్షలను ప్రారంభించింది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుసగా సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాలు, ఉత్తాంధ్ర.. ఇలా ప్రాంతాల వారీగా ఆయన ఈ సమీక్షలకు దిగుతున్నారు. జనసేన పార్టీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో.. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చోటు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడిగా అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.