AP Cabinet: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్: డబ్బు, మద్యం పంచితే అనర్హత వేటే..!
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక స్థానిక సంస్థల పోలింగ్పై దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చోటు చేసకున్న జాప్యాన్ని నివారించడానికి చేపట్టాల్సిన నిర్ణయాలపైనా మంత్రులు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
Save Tamil Nadu: తమిళనాడులో వైఎస్ జగన్ పోస్టర్లు: హీరో విజయ్, ప్రశాంత్ కిశోర్లతో..!
వైఎస్ జగన్ అధ్యక్షతన..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం మంత్రివర్గం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎనిమిది అంశాలపై మంత్రివర్గం చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికలు, మద్యం, డబ్బు రహితంగా ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రచార పర్వాన్ని కుదించడం, జగనన్న విద్యా దీవెన, ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలను ఇవ్వడం.. వంటి అజెండాలపై చర్చించారు
వచ్చే నెల 15వ తేదీ నాటికి..
ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గ సమావేశం కేంద్రీకృతమైంది. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే నెలకొన్న జాప్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్.. మంత్రులకు వివరించినట్లు చెబుతున్నారు. దీనికోసం చేపట్టిన చర్యలను ఆయన మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 15వ తేదీ నాటికల్లా స్థానిక సంస్థల ఎన్నికలను ముగించేయాలని చెప్పారు.
27 నుంచి 20 రోజులకు..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఎంత సుదీర్ఘంగా కొనసాగితే.. అంతగా అవినీతికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీన్ని నివారించడానికి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను 20 రోజులకు కుదించడానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించినట్లు సమాచారం. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 27 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. దీన్ని కుదించాలంటే పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణకు కూడా మంత్రివర్గం అంగీకరించినట్లు చెబుతున్నారు.
Recommended Video
డబ్బు, మద్య రహితంగా ఎన్నికలు..
డబ్బు, మద్య రహితంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించగా.. దానికి మంత్రులు కొన్ని సూచనలను చేశారని అంటున్నారు. ఈ సూచనల ప్రకారం.. ఓటర్లను ప్రలోభానికి గురి చేయడానికి డబ్బు, మద్యాన్ని పంచుతూ అభ్యర్థులు లేదా.. వారి తరఫు అనుచరులు, కుటుంబ సభ్యులు దొరికితే.. సదరు అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా గుర్తించేలా చట్టాన్ని సవరిద్దామని కొందరు మంత్రులు సూచించారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించారని చెబుతున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగాజరిగితే .. తమ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఒకటి నుంచి పదో తరగతి వరకు..
దీనితోపాటు ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్కూలు బ్యాగ్ ఇవ్వడానికి రూపొందించిన ప్రతిపాదనలపైనా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించాలని పేర్కొంది. దీనికి అయ్యే ఖర్చును జగనన్న విద్యా దీవెనకు కేటాయించిన నిధుల నుంచివినియోగించాల్సి ఉంటుంది.
ఎర్రచందనం కేసుల పరిష్కారానికి..
ఎర్ర చందనం కేసులను పరిష్కరించడానికి తిరుపతిలో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడం, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన ర్యాలీల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను రద్దు చేయడం, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.