రాజధానిపై రేపే తేల్చేస్తారా..? ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ
హైపవర్ కమిటీ నివేదికపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ శనివారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. పరిపాలన వికేంద్రీకరణ,సమగ్రాభివృద్దికి సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది. నిజానికి హైపవర్ కమిటీ నివేదికపై ఈ నెల 20వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి.. ఆ తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సమావేశం జరపాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
హైపవర్ కమిటీ భేటీ
శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హైపవర్ కమిటీ సీఎం జగన్కు ప్రజేంటేషన్ ద్వారా నివేదికను వివరించింది. జీఎన్ రావు కమిటీ,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై రూపొందించిన వేర్వేరు ప్రతిపాదనలను హైపవర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని రైతుల అభ్యర్థనలు,ఉద్యోగుల తరలింపుకు సంబంధించిన అంశాలను మంత్రులు బుగ్గన,బొత్స సీఎంకు వివరించినట్టు సమాచారం.
రెండు రోజుల ముందే కేబినెట్ భేటీ..
షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే కేబినెట్ సమావేశమవుతుండటంతో.. రాజధానిపై ప్రభుత్వం రేపే తేల్చేయనుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాజధానిపై ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రేపటి కేబినెట్ సమావేశంలో దానికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అదే జరిగితే రాజధాని రైతులకు ఎలాంటి పరిహారం ఇస్తారు? ప్రజా అభ్యంతరాలపై ఎలా స్పందింస్తారన్నది చూడాలి.
ప్రక్రియను వేగవంతం చేసేందుకే.. :
మరోవైపు హైపవర్ కమిటీ శనివారం కూడా సీఎంతో భేటీ అవుతుందని మంత్రి బొత్స తెలిపారు. అంటే, ఉదయం హైపవర్ కమిటీతో భేటీ ముగిశాక.. సీఎం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
రేపటితో హైపవర్ కమిటీ తుది నివేదికను అందజేస్తుండటంతో.. రాజధానిపై దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తుది నివేదిక అందిన తర్వాత.. రాజధాని ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతోనే కేబినెట్ సమావేశాన్ని రెండు రోజుల ముందుకు జరిపినట్టు సమాచారం. కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత.. అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టనున్నారు.
హైకోర్టు ట్విస్టు..
శనివారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలన్న సీఎం నిర్ణయానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రాజధాని రైతులు తమ సమస్యలు,అభ్యంతరాలు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం 2.30గంటల వరకు గడువును పెంచుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. అందరి సమస్యలు,అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి.. రేపటి సమావేశంలో హైపవర్ కమిటీ తుది నివేదిక అందించకపోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశం జరుగుతుందా లేదా..? అన్న చర్చ జరుగుతోంది.