త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ?: ఒక్కరికే ఛాన్సా, మార్పులు, చేర్పులా??
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విస్తరణపై పలుమార్లు చర్చ సాగుతోంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నాయి.
అంతకుముందు నుంచే విస్తరణపై జోరుగా చర్చ సాగుతోంది. అదిగో విస్తరణ.. ఇదిగో విస్తరణ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగింది లేదు. కానీ తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తరణపై వార్తలు వస్తున్నాయి. ఈసారి విస్తరణ ఖాయమని అంటున్నారు.
వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా కొద్ది నెలల క్రితం వరకు కామినేని శ్రీనివాస రావు ఉన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చాక కామినేని, దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాల రావులు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య శాఖ వివాదం వచ్చినప్పుడల్లా విపక్షాలు మంత్రి లేరనే విషయంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. చంద్రబాబు కేబినెట్లో మైనార్టీ లేరు. దీంతో ఒకరికి అవకాశం దక్కనుందని అంటున్నారు. ఈ నెల 28వ తేదీన మైనార్టీ సదస్సు ఉంది. ఆ లోపే కేబినెట్ను విస్తరించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఖాళీగా ఉన్న ఒకటి లేదా రెండు స్థానాలతో భర్తీ చేస్తారా? లేక పూర్తిస్థాయిలో విస్తరణ చేస్తారా? లేక మార్పులు చేర్పులు చేస్తారా అనే చర్చ సాగుతోంది.
మైనార్టీ నేతల్లో షరీఫ్, చాంద్ బాషా పేరు వినిపిస్తోంది. ఫరూక్ పేరును పరిశీలించాలని పలువురు సూచించారు. మైనార్టీలతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి కూడా చోటు దక్కవచ్చునని అంటున్నారు.