ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. పోలీస్యాక్ట్-2017 ముసాయిదా బిల్లును ఆమోదించడంతోపాటు ఇంకా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.
అమరావతి: పోలీస్యాక్ట్-2017 ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయం నిర్ణయంతో డీజీపీని నియమించుకునే అవకాశం ఉంటుంది.
శనివారం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం.. పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా 2014-పోలీస్యాక్ట్కి సవరణ చేస్తూ పోలీస్యాక్ట్-2017 ముసాయిదాను కొత్తగా తీసుకువచ్చింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ను కూడా విడుదల చేయనున్నారు.
ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిర్ణయాధికారం కలిగి ఉండేందుకు వీలవుతుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను ఎంపిక చేసుకొని అందులోంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
2014 పోలీస్యాక్ట్ ప్రకారం.. కేంద్రానికి ముగ్గురు సీనియర్ అధికారుల జాబితాను పంపించి అందులో ఒక పేరును ఎంపిక చేసుకునేవారు. తాజాగా ఏపీకి కొత్త డీజీపీ నియామకంపై ఆరుగురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను కేంద్రానికి మూడుసార్లు పంపింది.
అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం .. 2014 చట్టానికి సవరణ తీసుకురావాలని భావించి.. 2017 పోలీస్యాక్ట్ ముసాయిదాను ఆమోదించింది.
రాజధాని ఆకృతికి సంబంధించి నార్మన్ ఫోస్టర్స్ డిజైన్స్ను ఆమోదించనున్నారు. కొత్త అసెంబ్లీకి టవర్ డిజైన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
దీంతోపాటు మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో విశాఖ అర్బన్ మండలం ఒక్కటే ఉంది.
దినదినాభివృద్ధి చెందుతున్నవిశాఖలో కొత్తగా మరో మూడు అర్బన్ మండలాలను ఏర్పాటు చేయాలని తాజా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. విజయవాడలోనూ మరో 3 అర్బన్ మండలాలు.. గుంటూరు, నెల్లూరు, కర్నూలు నగరాల్లో ఒక్కో అర్బన్ మండలం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీకి 75 ఎకరాలు కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాంతోపాటు.. మల్లవల్లిలో మెహన్ ఫిన్టెక్ కంపెనీకి 81 ఎకరాలు కేటాయించారు.
ట్రాన్స్జెండర్ పాలసీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ట్రాన్స్జెండర్లకు రూ. 1500 పెన్షన్, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉపాధికల్పన కోసం వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.