20న కేబినెట్ సమావేశం:హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం: గంటలోనే అసెంబ్లీలో..!
ఈ నెల 18న నిర్వహించాలని భావించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20న జరగనుంది. మూడు రాజధానుల నిర్ణయానికి ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. జీఎన్ రావు ..బోస్టన కమిటీల రిపోర్టుపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 17న సమావేశం కానుంది. 19న ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక అందించనుంది.
20న కేబినెట్ లో దీనికి ఆమోద ముద్ర వేసి ఆ వెంటనే గంట వ్యవధిలోనే అదే రోజు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్నారు. సాధ్యమైనంత వరకు అదే రోజు రాత్రికి సభలో చర్చ తరువాత ఈ తీర్మానానికి సభలో ఆమోదం పొందే విధంగా ప్రభుత్వం వ్యూహం సిద్దం చేస్తోంది. 21న మండలి భేటీ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.
20న ఉదయం ఏపీ కేబినెట్ భేటీ..
ఈ నెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈ నెల 18కి వాయిదా వేసారు. తాజాగా ప్రభుత్వం ఈ 20న ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఈ నెల 17న సమావేశమై తమ నివేదికకు తూది రూపు ఇవ్వనుంది. 18 లేదా 19 తేదీల్లో కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందచేయనుంది.
20న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికకు మంత్రిమండలి ఆమోదం తెలపటం లాంఛనంగా మారనుంది. అదే సమయంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన ముఖ్యమంత్రి..మంత్రులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. జనసేన ఎమ్మెల్యే ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా..టీడీపీ వ్యతిరేకిస్తోంది.
వెంటనే అసెంబ్లీలో నివేదిక..
20వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదిక ఆమోదించిన వెంటనే..అసెంబ్లీ సమావేశం 11 గంటలకు ప్రారంభం కానుంది. కేబినెట్ లో ఆమోదించిన గంట వ్యవధిలోనే అసెంబ్లీలో ప్రభుత్వం ఈ నివేదికను ప్రవేశ పెట్టనుంది. ముందుగా ప్రభుత్వం నుండి ఈ నివేదిక ను సభకు సమర్పించి..దీని ఆమోదానికి వీలుగా తీర్మానం ప్రతిపాదిస్తారు. ప్రభుత్వం నుండే చర్చ ప్రారంభించనున్నారు.
ఆ తరువాత సభలోని మూడు పార్టీలకు చెందిన సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పిన తరువాత..ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆలోచనలు..ఏపీ డీసెంట్రలైజేషన్..అభివృద్ధి ఏ రకంగా చేయబోయేదీ సుదీర్ఘంగా వివరించనున్నారు. ఆ వెంటనే తీర్మానం ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. అదే రోజు జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజుల నిర్వహించాలనే దాని పైన తుది నిర్ణయం తీసుకోనున్నా రు. ఈ తీర్మానంతో పాటుగా మండలి గతంలో తిరస్కరించిన ఇంగ్లీషు మీడియం బిల్లు..అదే విధంగా ఎస్సీ చట్టం బిల్లును శాసనసభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.
చివరగా మండలిలో తీర్మానం..
శాసనసభలో మూడు రాజధానుల అంశం పైన ఆమోదం లభించిన వెంటనే..21వ తేదీన శాసనసమండలిలో ప్రభుత్వం హైపవర్ కమిటీ నివేదిక పైన చర్చ చేపట్టాలని నిర్ణయించింది. అదే రోజున సభ్యుల అభిప్రాయాలు చెప్పిన తరువాత అక్కడ కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు. అయితే, శాసనసభలో అధికార పార్టీకి మెజార్టీ ఉండటంతో పెద్దగా సమస్య ఎదురయ్యే అవకాశం లేదు.
కానీ, మండలి లో మాత్రం భిన్న పార్టీలు ఉండటం.. అధికార వైసీపీకి కేవలం 9 మంది సభ్యులే ఉండటంతో..ఇక్కడ మూడు రాజధానుల అంశం పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఇక్కడ సైతం మూడు రాజధానుల తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి ప్రధానంగా అమరావతి రైతులు..ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి హామీలు..ప్రకటనలు చేస్తారనేది ఆసక్తి కరమైన అంశం.