ఆగస్టు 2న ఏపీ కేబినెట్ భేటీ:కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం
అమరావతి:ఆగస్టు 2 వతేదీ గురువారం ఉదయం 10.30కి అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విధివిధానాలను ఖరారు చేయడం ఖాయమని తెలిసింది.
రాష్ట్రంలో 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. ఇందుకు ప్రతి ఏటా రూ.1,470కోట్లు ఖర్చువుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా కూడా ఈ కేబినెట్ సమావేశం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పర్యాటక ప్రాజెక్టులు, భూకేటాయింపులు, కరువు మండలాలు, సాగునీటి ప్రాజెక్టులకు పాలనా అనుమతులపై కేబినెట్ చర్చించనుంది.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పేరూరులో గ్రామదర్శిని లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పటైన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూతనకు మెచ్యూరిటీ లేదని బిజెపి నేతలు విమర్శిస్తున్నారని, కానీ ఇప్పుడు వాళ్లే హుందాతనాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారని అన్నారు. తాను వైసీపీ ట్రాప్లో పడ్డానని అన్నారని, కానీ వైసీపీ కుడితిలో పడింది బీజేపీనేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఇదే సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ..."అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం...జిల్లాలో బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యమివ్వాలి. అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్శిటీ వచ్చి తీరుతుంది...జిల్లాకు కియా మోటార్స్, సౌత్కొరియా టౌన్షిప్ వచ్చింది...అనంతపురం జిల్లాలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నిస్తాం...అమరావతి నుంచి అనంతపురానికి నాలుగులైన్ల రహదారి నిర్మిస్తాం''...అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రం కోసం తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, న్యాయపరమైన కోర్కెలే కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం ప్రారంభించామని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కుట్రరాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ధర్మం తమవైపు ఉందని కాబట్టే పోరాడుతున్నామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
ఇదిలా వుండగా ఏపీ స్పీకర్ కోడెలకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2 శాతమే జరిగాయనడం సరికాదని లేఖలో నిలదీశారు. పోలవరం పనులు చూసి పులకించిపోయిన కోడెల...అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై తాను వేసిన పిల్కి...ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని కేవీపీ లేఖలో స్పష్టం చేశారు.