సీఎస్ ఎత్తుకు..సీఎం పైఎత్తు : కేబినెట్ భేటీ 14కి వాయిదా: 48గంటల ఎఫెక్ట్...!
ఏపీ రాజకీయాల్లోనే కాదు..పాలనా వ్యవస్థలోనూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎలాగైనా కేబినెట్ సమావేశం నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికి సీఎస్ ఎన్నికల సంఘం అనుమతితో ముడి పెట్టారు. తొలుత పదో తేదీ ఉదయం కేబినెట్ సమావేశానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, ఎన్నికల సంఘానికి ఇప్పుడు ఏపి ప్రభుత్వం నుండి అభ్యర్దన వెళ్లినా..ఆమోదం పొందదని అధికారులు భావించారు. సీఎస్ అడ్డుచెప్పకపోవటంతో ముఖ్యమంత్రి ఆయన ఆలోచనలను అంచనా వేసి ఏకంగా కేబినెట్ సమావేశం వాయిదా వేసారు.
కేబినెట్ భేటీ 14వ తేదీకి వాయిదా..
వివాదాస్పదంగా మారిన ఏపి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 10వ తేదీన సమావేశం నిర్వహించాలని భావించారు. ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం ఆమోదించినా..లేకున్నా..సమావేశం నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నారు. అధికారుల బిజినెస్ రూల్స్ను చర్చించాలని నిర్ణయించారు. దీంతో..ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..ఈనెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చయాలని..దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ వెళ్లింది. దీని పైన సీఎస్ సైతం ఎన్నికల సంఘం ఆమోదంతోనే కేబినెట్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటే ముందుగా అజెండా ఖరారు చేసుకొని..దానిని ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
అధికారుల తర్జన..భర్జన
ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కేబినెట్ నోట్ రావటంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్..సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ను పిలిపించారు. వారితో కేబినెట్ నిర్వహణ పైన చర్చించారు. ముందుగా అజెండా ఏంటో స్పష్టం చేయాలని సీఎస్ కోరారు. అజెండా ఖరారు చేస్తే..దీని పైన ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా అనుమతి కోరుతామని స్పష్టం చేసారు. అక్కడ ఒక మెలిక పెట్టారు. 10వతేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెబుతున్నారు...ఆ సమయానికి ముందుగా అంటే 48 గంటల ముందే ఎన్నికల సంఘానికి అనుమతి కోసం నివేదించాల్సి ఉంటుందని సీఎస్ తేల్చి చెప్పారు. దీంతో..సీయం కార్యదర్శి నేరుగా ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అజెండా విషయంతో పాటుగా ఎన్నికల సంఘం ఆమోదం పొందాలంటే కనీసం 48 గంటల ముందుగానే అజెండాన పంపాల్సి ఉంటుందనే విషయాన్ని సీఎంకు వివరించారు.
సీఎస్ ఎత్తుకు..సీఎం పైఎత్తు..
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం 48 గంటల ముందు అంటూ ట్విస్ట్ ఇవ్వటంతో వెంటనే సీఎం కార్యాలయం అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రితో దీని పైన చర్చించారు. పదవ తేదీన సమావేశం నిర్వహించాలంటే రేపు ఉదయం లోగా అజెండా ఖరారు చేసి..ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంది. దీంతో..ఎన్నికల సంఘం ఎక్కడా కేబినెట్ సమావేశాన్ని తిరస్కరించకుండా...భేటీ వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ బేటీని ఈనెల 14వ తేదీకి వాయిదా వేస్తూ...అజెండా తో కూడిన నోట్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అజెండాలో కరువు, ఫోనీ తుఫాను నష్టం, తాగునీటి ఎద్దడి వంటి అంశాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు సీఎస్ ఆ నోట్ ఆధారంగా ఎన్నికల సంఘానికి అజెండా నివేదించి..కేబినెట్ సమావేశానికి అనుమతి పొందాల్సి ఉంది.