నేటి కేబినెట్ లో కీలక నిర్ణయాల దిశగా : ఆ వెంటనే గవర్నర్ తో సీఎం జగన్ భేటీ -ఏం జరుగుతోంది..!!
రాష్ట్రంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా కొద్ది రోజులు గా ఏపీ ప్రభుత్వం..సినీ ఇండస్ట్రీలో చర్చకు కారణమైన సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం విక్రయించడంపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందు కోసం చట్ట సవరణకు ప్రభుత్వం ఈ మంత్రివర్గ భేటీ లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వం 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిచంగా..ఈ ఉత్తర్వుల పైన హైకోర్టు స్టే విధించింది. దీంతో..ఈ చట్ట సవరణకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి..నిర్ణయం తీసుకోనున్నారు.
అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలక నిర్ణయాలు
పట్టణాలు..నగర ప్రాంతాల్లోని అసైన్డ్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. ఆలయాల్లో భద్రతతో పాటుగా పలు చర్యల దిశగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కర్నూలులోని ప్రముఖ సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలకు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 50 ఎకరాలు కేటాయించనున్నారు.
దేవాలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులు
యూజీ విద్యార్థులకు వసతిగృహం, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏడు కిలోమీటర్ల దూరంలో భూములు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. సింహాచలం, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకాతిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు ఆలయాల పాలకవర్గాల్లో అదనంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించనుంది.
గవర్నర్ తో జగన్ కీలక భేటీ
విశాఖలోని శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భీమునిపట్నం మండలం కొత్తవలసలో సర్వే నంబరు-102లో ఉన్న భూమిని ఇవ్వబోతుంది. పీఠం కార్యకలాపాల విస్తరణకు ఈ భూములను కేటాయిస్తున్నారు. అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంది. దీనిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఈ సాయంత్రం గవర్నర్ తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
తాజా రాజకీయాల పైన చర్చతో ఆసక్తి
టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన వెంటనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. ఆ తరువాత టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ తీరు పైన స్పందించాలంటూ వినతి పత్రం ఇచ్చారు. ఇక, సీఎం జగన్ ఈ రోజు గవర్నర్ తో భేటీ సమయంలో జరిగిన మొత్తం పరిణామాలను వివరించే అవకాశం ఉంది. ఇక, నవంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల పైన గవర్నర్ తో సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.
Recommended Video
గవర్నర్ తో సీఎం భేటీ పైన ఉత్కంఠ
నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను అందజేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. అయితే, రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం జగన్ కొత్త కేబినెట్ గురించి ..అదే విధంగా తాజాగా ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు..ఢిల్లీ నేతల స్పందన వంటి అంశాల పైన స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాలనా పరమైన నిర్ణయాలతో పాటుగా రాజకీయంగానూ ఈ సారి కేబినెట్ భేటీ అపైన ఆసక్తి నెలకొని ఉంది.